
ఏపీలో బీసీ ప్రజలకు కూటమి ప్రభుత్వం త్వరలో కీలక శుభవార్త చెప్పే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీ అమలుకు ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. రిజర్వేషన్లపై న్యాయపరమైన చిక్కులు రాకుండా బీసీల సామాజిక, ఆర్థిక, రాజకీయ వెనుకబాటుతనాన్ని అధ్యయనం చేసిన ఏకసభ్య డెడికేటెడ్ కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలోని కమిషన్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి బీసీ సంఘాలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులు, ఇతర వర్గాలతో సంప్రదింపులు జరిపింది. స్థానిక సంస్థల్లో బీసీల ప్రాతినిధ్యం, సామాజిక-ఆర్థిక పరిస్థితులు, రిజర్వేషన్ల అమలుకు సంబంధించిన అంశాలపై వివరాలను సేకరించింది.
ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయం
కమిషన్ నివేదిక అందిన నేపథ్యంలో బీసీలకు ఎంత శాతం రిజర్వేషన్ కల్పించాలి, ఏ విధంగా అమలు చేయాలి, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను ఎలా ఖరారు చేయాలనే అంశాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. కమిషన్ సిఫార్సుల ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టే అవకాశం ఉంది.
ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రధాన హామీల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కూడా ఒకటి. ఈ హామీ అమలైతే స్థానిక సంస్థల్లో బీసీల రాజకీయ ప్రాతినిధ్యం మరింత పెరిగే అవకాశం ఉంది.

