
ఏలూరు, ఆగస్టు 14 D news: ఏలూరు జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించనున్న 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లను జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ శుక్రవారం పరిశీలించారు. వేడుకల ఏర్పాట్లతో పాటు పోలీసు కవాతు రిహార్సల్స్ను తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కార్యక్రమంలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా సంబంధిత అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ సూచించారు. ప్రముఖులు, అధికారులు, ప్రజలకు అసౌకర్యం కలగకుండా ప్రోటోకాల్కు అనుగుణంగా సీటింగ్ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
ట్రాఫిక్కు అంతరాయం లేకుండా వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేయాలని సూచించారు. వేడుకల ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించాలని స్పష్టం చేశారు.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ప్రతిష్ఠాత్మకంగా, క్రమశిక్షణతో నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) వై. ప్రసాద్ రావు, ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు, ఏఆర్ ఆర్ఐ పవన్ కుమార్, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

