
కర్నూలు రూరల్ బ్యూరో, D news: గత 12 ఏళ్లలో బీజేపీ ప్రభుత్వం తీసుకున్నట్లు చెబుతున్న రూ.150 లక్షల కోట్ల విదేశీ అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చింతామోహన్ డిమాండ్ చేశారు. కర్నూలులో మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు చేశారు.
బీజేపీ పాలనలో నిరుద్యోగం, ధరల పెరుగుదల, అప్పుల భారం పెరిగాయని ఆరోపించారు. పేదల కంటే కార్పొరేట్లకు కేంద్రం మేలు చేస్తోందని విమర్శించారు.
రుణమాఫీలపై ఆరోపణలు
గత 12 ఏళ్లలో బ్యాంకులు రూ.16 లక్షల కోట్ల మేర రుణాలను మాఫీ చేశాయని చింతామోహన్ ఆరోపించారు. పెద్ద రుణగ్రహీతలకు ప్రయోజనం కల్పించారని విమర్శించారు. రూ.15 లక్షల నల్లధనం, ఏటా రెండు కోట్ల ఉద్యోగాల హామీలను బీజేపీ నెరవేర్చలేదని అన్నారు.
రాజ్యాంగంపై హెచ్చరిక
రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నాలు దేశ సమైక్యతకు ముప్పుగా మారతాయని చింతామోహన్ హెచ్చరించారు. ఇలాంటి చర్యలతో విభజన భావనలు పెరిగే ప్రమాదం ఉందన్నారు.
ఏపీలో అవినీతి పెరిగిందని ఆరోపణ
ఆంధ్రప్రదేశ్లో పేదల భూములను కోటీశ్వరులకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అవినీతి పెరిగిందని, ప్రతి ఫైల్కు డబ్బులు వసూలు చేసే పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు.
కాపులు కాంగ్రెస్లోకి రావాలి
కాపులు, బలిజలు కాంగ్రెస్లోకి రావాలని చింతామోహన్ పిలుపునిచ్చారు. 2029లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కాపులు, బలిజలకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.

