
పుణెలోని ఓ ప్రముఖ స్వీట్ షాపు నిబంధనలు పాటించడం లేదంటూ ఎఫ్డీఏ అధికారులు దాని లైసెన్సును రద్దు చేశారు. అయితే, యాజమాన్యం లోపాలను సరిదిద్దుకుని, పునఃపరిశీలన చేపట్టాలని అధికారులను కోరింది. దీంతో అధికారులు మరోసారి తనిఖీలు నిర్వహించగా, పారిశుద్ధ్య ప్రమాణాల్లో షాపు ఏకంగా 98 శాతం మార్కులు సాధించింది.
అయినప్పటికీ, షాపుపై విధించిన సస్పెన్షన్ను ఎత్తివేయాల్సిన అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో యాజమాన్యం న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించింది. కేసును విచారించిన న్యాయస్థానం ఎఫ్డీఏ అధికారుల వైఖరిలో తప్పిదాన్ని గుర్తించింది. బాధిత యాజమాన్యానికి రూ.5 లక్షల నష్టపరిహారం చెల్లించాలని అధికారులను ఆదేశించింది.
సాధారణంగా షాపులు, రెస్టారెంట్లు, హోటళ్లలో నిబంధనలు ఉల్లంఘిస్తే ఫుడ్ అథారిటీలు చర్యలు తీసుకోవడం మనకు తెలిసిందే. నిబంధనలు పాటించని వ్యాపార సంస్థలకు జరిమానాలు విధించడంతో పాటు, అవసరమైతే వాటి లైసెన్సులను సైతం రద్దు చేస్తుంటాయి. అయితే, ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. నిబంధనలు పాటించని దుకాణానికి కాకుండా.. చర్యలు తీసుకున్న ఫుడ్ అథారిటీకే బాంబే హైకోర్టు జరిమానా విధించింది.
పుణేలోని ఓ స్వీట్ షాపు ఆహార భద్రతకు సంబంధించిన తనిఖీల్లో దాదాపు 98 శాతం నిబంధనలను పాటించినప్పటికీ, దాని లైసెన్స్ సస్పెన్షన్ను ఎత్తివేసి పునరుద్ధరించేందుకు మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) అధికారులు నిరాకరించారు. దీంతో ఆ వ్యాపారం ఆర్థికంగా తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంది.
ఈ వ్యవహారాన్ని విచారించిన బాంబే హైకోర్టు.. ఎఫ్డీఏ అధికారుల తీరును తప్పుబట్టింది. నిబంధనలు దాదాపు పూర్తిగా పాటించిన దుకాణం లైసెన్స్ను పునరుద్ధరించకుండా వ్యాపారాన్ని దెబ్బతీయడం సరికాదని పేర్కొంది. ఈ కారణంగా సదరు దుకాణానికి జరిగిన నష్టాన్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్కు ఏకంగా రూ.5 లక్షల జరిమానా విధించింది.
ఫుడ్ సేఫ్టీ నిబంధనలను అమలు చేయాల్సిన అధికార సంస్థపైనే కోర్టు జరిమానా విధించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఏమిటి? కోర్టు ఎందుకు ఎఫ్డీఏ తీరును తప్పుబట్టింది? స్వీట్ షాపు విషయంలో అసలు ఏం జరిగింది? ఇప్పుడు తెలుసుకుందాం.

