
దేశంలో డిజిటల్ అరెస్ట్లు సహా 1000కిపైగా సైబర్ నేరాలకు పాల్పడిన యువకుడ్ని అసోంలో అరెస్ట్ చేశారు. ఈ నేరాల ద్వారా ఏకంగా రూ.1071 కోట్లను కొల్లగొట్టి, వాటిని గుట్టుచప్పుడు కాకుండా దేశం దాటించడానికి వేలాది బ్యాంకు ఖాతాలను వాడుకున్నాడు. కొట్టేసిన సొమ్మును చిన్న చిన్న మొత్తాలుగా చేసి.. ఐటీ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలకు అనుమానం రాకుండా వేర్వేరు ఖాతాల్లోకి జమచేసేవాడు. తిరిగి వాటిని క్రిప్టో కరెన్సీగా మార్చేసినట్టు పోలీసులు గుర్తించారు. అతడి తెలివికి పోలీసులు అవాక్కయ్యారు.
దేశవ్యాప్తంగా 1,090 సైబర్ నేరాలకు పాల్పడి రూ.1,071.5 కోట్లను కొల్లగొట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ మాస్టర్మైండ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. చైనాకు చెందిన సైబర్ ముఠాలతో సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్న 25 ఏళ్ల రఫీకుల్ ఆలమ్ను అసోంలోని బార్పేటలో గుజరాత్ సీఐడీ సైబర్ సెల్ అదుపులోకి తీసుకుంది.
డిజిటల్ అరెస్ట్ సహా పలు రకాల సైబర్ మోసాల ద్వారా బాధితుల నుంచి దోచుకున్న డబ్బును వేలాది బ్యాంకు ఖాతాల ద్వారా మళ్లించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అనంతరం ఆ నగదును క్రిప్టోకరెన్సీగా మార్చి చైనాకు తరలించడంలో ఆలమ్ కీలకంగా వ్యవహరించినట్లు దర్యాప్తు అధికారులు తెలిపారు.
వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా చైనాకు చెందిన సైబర్ నేరగాళ్లతో ఆలమ్ నిరంతరం సంప్రదింపులు జరిపినట్లు అధికారులు తెలిపారు. స్కానర్లు, యూజర్ ఐడీలు, పాస్వర్డ్లు, క్రిప్టో వాలెట్ వివరాలు వంటి కీలక ఆర్థిక సమాచారంతో పాటు నేరాలకు సంబంధించిన విధానాలను కూడా వారితో పంచుకున్నట్లు వెల్లడించారు.
ఆలమ్కు చెందిన మొబైల్ ఫోన్లను పరిశీలించిన పోలీసులు 23 క్రిప్టోకరెన్సీ వాలెట్లను గుర్తించారు. వీటి ద్వారా సుమారు రూ.16 కోట్ల మేర లావాదేవీలు జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ వివరాలు క్రిప్టో లావాదేవీలకు, చైనా సైబర్ ముఠాలకు మధ్య ఉన్న సంబంధాలను బలపరుస్తున్నాయని పేర్కొన్నారు. అలాగే ‘చిప్ సెల్లర్’ అనే యాప్ ద్వారా అక్రమ క్రిప్టో ట్రేడింగ్ నిర్వహించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
సాంకేతిక విశ్లేషణతో పాటు బాధితులకు సంబంధించిన వివరాలను ఆధారంగా చేసుకున్న గుజరాత్ సైబర్ క్రైమ్ పోలీసులు అసోంలోని బార్పేటకు చేరుకున్నారు. అక్కడ ఆలమ్ నివాసం వద్ద మూడు రోజుల పాటు మారు వేషాల్లో నిఘా పెట్టి, అతడి కదలికలను గమనించారు. సరైన సమయం చూసి చివరకు ఆలమ్ను డిజిటల్ పరికరాలతో సహా అదుపులోకి తీసుకున్నారు.

