
అయోధ్య రామ మందిర ప్రసాదం పేరుతో సాధారణ స్వీట్లను ఆన్లైన్లో విక్రయించిన వ్యవహారంలో అమెజాన్కు షాక్ తగిలింది. ఈ కేసులో సంస్థకు రూ.1 లక్ష జరిమానా విధించారు. బిహార్ బ్రదర్స్ బ్రాండ్కు చెందిన స్వీట్లను ‘శ్రీ రామ్ మందిర్ అయోధ్య ప్రసాద్’ పేరుతో అమెజాన్లో విక్రయించినట్లు అధికారులు గుర్తించారు.
అయితే, ఈ స్వీట్ల విక్రయానికి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నుంచి ఎలాంటి అధికారిక అనుమతి లేదని అధికారులు వెల్లడించారు. 2024 జనవరిలో అందిన ఫిర్యాదుపై విచారణ చేపట్టిన అధికారులు, నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు నిర్ధారించి చర్యలు తీసుకున్నారు.
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్కు కేంద్ర వినియోగదారుల పరిరక్షణ అథారిటీ (సీసీపీఏ) భారీ జరిమానా విధించింది. ‘శ్రీ రామ్ మందిర్ అయోధ్య ప్రసాద్’ పేరుతో సాధారణ స్వీట్లను ఆన్లైన్లో విక్రయించేందుకు అనుమతించినందుకు అమెజాన్ సెల్లర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్పై రూ.1 లక్ష పెనాల్టీ విధిస్తూ సీసీపీఏ ఆదేశాలు జారీ చేసింది. ఈ మొత్తాన్ని 15 రోజుల్లోగా చెల్లించాలని స్పష్టం చేసింది.
అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నుంచి ఎలాంటి అధికారిక అనుమతి లేకుండానే సాధారణ స్వీట్లను ‘రామ మందిర ప్రసాదం’గా ప్రచారం చేసి విక్రయించినట్లు సీసీపీఏ విచారణలో తేలింది. ఈ వ్యవహారంలో ‘బిహార్ బ్రదర్స్’ బ్రాండ్ పేరుతో చందు ట్రేడింగ్ విక్రయించిన ఉత్పత్తులను అమెజాన్ తన ప్లాట్ఫామ్పై ‘శ్రీ రామ్ మందిర్ అయోధ్య ప్రసాద్’ పేరుతో అందుబాటులో ఉంచినట్లు అధికారులు గుర్తించారు.
ఈ ఉత్పత్తుల్లో నెయ్యి లడ్డూలు, ఖోయా లడ్డూలు, బూందీ లడ్డూలు, ఆవు పాల పేడా వంటి స్వీట్లు ఉన్నాయి. వీటిని ప్రసాదంగా ప్రచారం చేయడంతో పాటు ఉత్పత్తుల వివరణలో ‘లార్డ్ రామ్ ఆశీర్వాదాలు’ వంటి పదాలను కూడా ఉపయోగించినట్లు సీసీపీఏ పేర్కొంది.
అధికారిక అనుమతులు లేకుండా సాధారణ స్వీట్లను ఆలయ ప్రసాదంగా ప్రచారం చేయడం వినియోగదారులను తప్పుదోవ పట్టించే చర్యగా పరిగణించిన సీసీపీఏ, అమెజాన్పై ఈ చర్య తీసుకుంది.
అయితే, ఈ స్వీట్లను ‘అయోధ్య రామ మందిర ప్రసాదం’ పేరుతో విక్రయించేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నుంచి ఎలాంటి అధికారిక అనుమతి లేదా ఆమోదం తీసుకోలేదని సీసీపీఏ విచారణలో వెల్లడైంది. ఈ వ్యవహారంపై కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) 2024 జనవరిలో సీసీపీఏకు ఫిర్యాదు చేసింది.
ఫిర్యాదుపై విచారణ చేపట్టిన సీసీపీఏ అధికారులు.. ‘అయోధ్య రామ మందిర ప్రసాదం’ అనే పేరును చూసిన భక్తులు, వినియోగదారులు ఆ ఉత్పత్తులను నిజమైన ఆలయ ప్రసాదంగా భావించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆలయ పేరు, ప్రసాదం పేరును అధికారిక అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించడం వినియోగదారులను తప్పుదోవ పట్టించడమే కాకుండా, కోట్లాది మంది భక్తుల మతపరమైన భావాలను దెబ్బతీసే అవకాశం ఉందని సీసీపీఏ అభిప్రాయపడింది.
ఈ కేసులో అమెజాన్ కేవలం మధ్యవర్తి మాత్రమేనని చెప్పి బాధ్యత నుంచి తప్పించుకోలేదని సీసీపీఏ స్పష్టం చేసింది. తమ ప్లాట్ఫామ్పై విక్రయించే ఉత్పత్తులు ఏ పేరుతో, ఏ విధంగా ప్రచారం అవుతున్నాయనే విషయంపై ఈ-కామర్స్ సంస్థలు మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఈ ఆదేశాలు స్పష్టం చేస్తున్నాయి.

