D-News: ఏలూరు జిల్లా ముసునూరులోని గౌర్మెట్ పాప్కార్నికా కేంద్రంలో జరిగిన ప్రత్యేక వ్యవసాయ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి భారత ఉపరాష్ట్రపతి సి.పీ. రాధాకృష్ణన్తో పాటు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు.
ఈ సందర్భంగా భారతదేశంలోనే తొలిసారిగా రూపొందించిన నాన్-GMO, హై-ఎక్స్పాంషన్ పాప్కార్న్ మొక్కజొన్న హైబ్రిడ్ విత్తనాన్ని ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. దేశీయ విత్తన అభివృద్ధి, వ్యవసాయంలో సాంకేతికత, కొత్త ఆవిష్కరణలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించవచ్చని ఆయన అన్నారు.
ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి వ్యవసాయ రంగం కీలకమని, రైతుల ఆదాయం పెంచేందుకు కొత్త సాంకేతికత, నాణ్యమైన విత్తనాలు ఉపయోగపడతాయని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్థానిక వ్యవసాయంలో విశేష కృషి చేసిన రైతులను సత్కరించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. నాన్-GMO పాప్కార్న్ మొక్కజొన్నను ప్రస్తుతం 40 వేల ఎకరాల్లో 17,500 మంది రైతులు సాగు చేస్తున్నారని తెలిపారు. ముసునూరు దేశంలోనే అతిపెద్ద పాప్కార్న్ ప్రాసెసింగ్, ఎగుమతి కేంద్రంగా ఎదుగుతోందని చెప్పారు.
రైతుల కృషి, సాంకేతికత, దేశీయ విత్తన అభివృద్ధి కలిస్తే వ్యవసాయ రంగంలో మరిన్ని అవకాశాలు ఏర్పడతాయని ఈ కార్యక్రమం చాటిచెప్పింది.

