
కృత్తివెన్ను, రైతులకు బ్యాంకింగ్ సేవలను మరింత చేరువ చేయడంతోపాటు సహకార రంగాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో బలోపేతం చేస్తున్నామని కేడీసీసీ బ్యాంక్ చైర్మన్, మాజీ మంత్రి నెట్టెం శ్రీ రఘురామ్ తెలిపారు. తాను చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం బ్యాంకు మొత్తం వ్యాపారం రూ.1,800 కోట్ల మేర పెరిగిందని చెప్పారు.
కృష్ణాజిల్లా కృత్తివెన్ను మండలం లక్ష్మీపురం గ్రామంలో శేరిలక్ష్మీపురం కేడీసీసీ బ్యాంక్ నూతన శాఖను శుక్రవారం నెట్టెం రఘురామ్, పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులు, ఖాతాదారులకు అందుతున్న బ్యాంకింగ్ సేవలపై వారు వివరించారు.
పీఏసీఎస్లను కంప్యూటరీకరించడం ద్వారా రైతులకు సేవలు మరింత వేగంగా అందుతున్నాయని రఘురామ్ తెలిపారు. పీఏసీఎస్ స్థాయిలోనే యూపీఐ సేవలు అందించిన తొలి బ్యాంకుగా కేడీసీసీ ప్రత్యేక గుర్తింపు పొందిందని పేర్కొన్నారు.
బంటుమిల్లి పరిధిలో డ్వాక్రా మహిళలకు రూ.2.50 కోట్ల రుణాలను పంపిణీ చేశారు. రైతులు, మహిళా సంఘాల ఆర్థిక అవసరాలకు అనుగుణంగా రుణ సదుపాయాలు కల్పిస్తూ సహకార వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని నెట్టెం రఘురామ్ తెలిపారు.
