
స్వచ్ఛ ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్ను మరో సౌదీ అరేబియాగా మార్చాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి లోకేశ్ అన్నారు. టాటా పవర్ రెన్యువబుల్ ఎనర్జీ లిమిటెడ్ (టీపీఆర్ఈఎల్) సుజ్లాన్ గ్రూప్తో కలిసి సుమారు రూ.5,750 కోట్ల వ్యయంతో కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఏర్పాటు చేయనున్న 800 మెగావాట్ల క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు పరిశ్రమల మంత్రి టీజీ భరత్తో కలసి ఆయన గురువారం కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరులో శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు బహిరంగ సభలో మంత్రి లోకేశ్ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బ్రూక్ఫీల్డ్, బ్లాక్స్టోన్, బ్లాక్రాక్, ఈక్యూటీ, టీపీజీ.. వంటి అంతర్జాతీయ సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెడుతున్నాయన్నారు. టాటా పవర్, సుజ్లాన్, రెన్యూ, ప్రీమియర్ ఎనర్జీస్, ఏసీఎంఈ.. వంటి భారతీయ దిగ్గజ కంపెనీలు కూడా రాష్ట్రంలో విస్తరిస్తున్నాయని వివరించారు. గతేడాదితో పోలిస్తే ఈ ఒక్క సంవత్సరంలోనే ఏపీలో పునురుత్పాదక ఇంధన సామర్థ్యం 400 శాతం పెరిగిందన్నారు.
పారిశ్రామిక వర్గాల్లో విశ్వసనీయతను పునరుద్ధరించడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పునరుత్పాదక ఇంధన రంగం అస్తవ్యస్థంగా ఉండేదన్నారు. ఒకసారి దెబ్బతిన్న విశ్వాసాన్ని పునరుద్ధరించడం రాత్రికి రాత్రే సాధ్యం కాదన్నారు. పెట్టుబడిదారుల్లో మళ్లీ నమ్మకాన్ని పెంపొందిస్తూ రావడంతో రాష్ట్రానికి పరిశ్రమలు వరుస కడుతున్నాయని పేర్కొన్నారు. అందుకు కరువు సీమలో టాటా సంస్థ స్థాపించే భారీ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టే నిదర్శనమన్నారు.

