
గ్రామాలను డిజిటల్గా అభివృద్ధి చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘దాన్వీర్’ పేరుతో వినూత్న పౌర భాగస్వామ్య కార్యక్రమాన్ని ప్రారంభించింది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా విదేశాల్లో స్థిరపడిన భారతీయులు, పెద్ద సంస్థలు తమ స్వగ్రామాల్లో డిజిటల్ సదుపాయాల అభివృద్ధికి సహకరించే అవకాశం కల్పించారు.
‘మేరీ పంచాయత్’ యాప్ ద్వారా ఆసక్తి ఉన్న వారు స్వచ్ఛందంగా కంప్యూటర్లు, ఇతర డిజిటల్ పరికరాలను తమ గ్రామాలకు విరాళంగా అందించవచ్చు. దాతలు అందించిన పరికరాలను గ్రామాల్లో వినియోగంలోకి తీసుకువచ్చే వరకు వాటి వివరాలను ట్రాక్ చేసే సదుపాయాన్ని కూడా ప్రభుత్వం కల్పిస్తోంది.
ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ మౌలిక వసతులను బలోపేతం చేయడంతో పాటు, పౌరులు, సంస్థలను గ్రామాల అభివృద్ధిలో భాగస్వాములను చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.
దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ ఉన్నత స్థాయిలో స్థిరపడిన చాలామంది పండగలు, ప్రత్యేక సందర్భాల్లో తమ సొంత గ్రామాలకు వస్తుంటారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ.. తాము పెరిగిన ఊరు ఇంకా అభివృద్ధి చెందకపోవడాన్ని చూసి, గ్రామానికి తమ వంతుగా ఏదైనా చేయాలనే ఆలోచన చాలామందిలో కలుగుతుంది.
అలాంటి వారికి కేంద్ర ప్రభుత్వం ఓ వినూత్న అవకాశాన్ని అందిస్తోంది. ‘మీ గ్రామానికి ఎంతోకొంత తిరిగి అందించండి’ అనే ఉద్దేశంతో పౌరులను గ్రామాల అభివృద్ధిలో భాగస్వాములను చేసే కార్యక్రమాన్ని ప్రారంభించింది.
ప్రత్యేకంగా రూపొందించిన యాప్ ద్వారా తమ సొంత గ్రామానికి అవసరమైన సదుపాయాల కల్పనలో భాగస్వాములు కావచ్చు. తమకు సాధ్యమైన రీతిలో సహాయం అందిస్తూ గ్రామాభివృద్ధికి తోడ్పడే అవకాశం ఈ కార్యక్రమం ద్వారా కల్పిస్తున్నారు.
ఈ కాన్సెప్ట్ వింటే వెంటనే ‘శ్రీమంతుడు’ సినిమా గుర్తుకు వస్తుంది కదా! అందులో హీరో తన సొంత ఊరిని దత్తత తీసుకుని అభివృద్ధి చేసినట్టే.. మనం పుట్టి పెరిగిన నేల కోసం మన వంతుగా కొంత సహాయం చేస్తే, మన కళ్ల ముందే గ్రామం అభివృద్ధి చెందుతుంది.
అదే ఆలోచనకు దగ్గరగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘దాన్వీర్’ కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమం ద్వారా మీ సొంత గ్రామానికి డిజిటల్ సదుపాయాలను అందించేందుకు సహకరించవచ్చు. గ్రామాన్ని డిజిటలైజ్ చేయాలనుకునే వారు తమ వంతు సాయం అందించే అవకాశాన్ని ‘దాన్వీర్’ కల్పిస్తోంది.

