
నకిలీ నోట్ల చలామణిపై అత్యంత అప్రమత్తంగా ఉండాలని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ). బ్యాంకులను కోరింది. అంతర్జాతీయ సరిహద్దులకు చేరువలోని జిల్లాల్లో ఉన్న బ్యాంకు శాఖలు నకిలీ నోట్లను గుర్తించేందుకు తప్పనిసరిగా నోట్ల ధ్రువీకరణ, సార్టింగ్ మెషిన్లను ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించింది.
ఖాతాదారులు సమర్పించే కరెన్సీ నోట్లు అసలువా లేక నకిలీవా అనే విషయాన్ని తప్పనిసరిగా ఈ మెషిన్ల ద్వారా నిర్ధారించుకున్న తర్వాతే తీసుకోవాలని స్పష్టం చేసింది. ఒకవేళ ఖాతాదారుడు ఇచ్చిన నోటు నకిలీదని తేలితే ఆ నోటును ఖాతాదారుడికి తిరిగి ఇవ్వడం లేదా స్వాధీనం చేసుకోవడం చేయాలని స్పష్టం చేసింది.
నకిలీ నోట్ల విషయంలో కొన్ని బ్యాంకులు నిర్లక్ష్యంగా ఉన్నట్టు వార్తలు రావడంతో ఆర్బీఐ ఈ ఆదేశాలు జారీ చేసింది. దీనికి తోడు నగదు లావాదేవీలు జరిపే సిబ్బంది అందరికీ ఈ ఏడాది అక్టోబరులోగా అసలు నోట్లు, నకిలీ నోట్లను గుర్తించే నైపుణ్యాలపై పూర్తి శిక్షణ ఇవ్వాలని ఆదేశించింది. నకిలీ నోట్ల గుర్తింపు, రిపోర్టింగ్, పర్యవేక్షణకు సంబంధించి కూడా బ్యాంకులు సమగ్ర విధానం అనుసరించాలని కోరింది.

