
ఏపీ రాజధానికి అమరావతికి కేంద్రం నుంచి శుభవార్త వచ్చింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ క్వాంటమ్, ఏఐ యూనివర్సిటీ క్యాంపస్కు అడుగులు పడుతున్నాయి. మొత్తం రూ.731 కోట్లతో ఏర్పాటు కేంద్రం నీలిట్ క్యాంపస్ ఏర్పాటు చేయనుంది. ఈ ఏడాది సెప్టెంబర్లో నీలిట్ క్యాంపస్ను గుంటూరులోని ఆచార్యో నాగార్జున యూనివర్శిటీలో తాత్కాలికంగా కార్యకలాపాలు ప్రారంభించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కేంద్రం తీపికబురు చెప్పింది. రాజధానిలో ఎన్నో ప్రతిష్టాత్మక సంస్థలు ఏర్పాటవుతుండగా.. తాజాగా మరో ప్రతిష్ఠాత్మక కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థ ఏర్పాటు కానుంది. అమరావతిలో నీలిట్ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) దేశంలోనే తొలి, అత్యాధునిక క్వాంటమ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీ క్యాంపస్ను రూ.731.7 కోట్లతో ఏర్పాటు చేయనున్నారు. ఏపీ ప్రభుత్వం ఈ క్వాంటమ్, ఏఐ యూనివర్సిటీ క్యాంపస్ కోసం రాజధానిలోని నిడమర్రు దగ్గర 10 ఎకరాలను 30 ఏళ్ల పాటు లీజుకు (ఆ తర్వాత మరో 30 ఏళ్లకు పొడిగించేలా) కేటాయించింది. వాస్తవానికి నీలిట్ 19 ఎకరాల భూమి కావాలని కోరగా.. ఏపీ ప్రభుత్వం మాత్రం 10 ఎకరాలు కేటాయించింది.
నీలిట్ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే స్వయంప్రతిపత్తి ఉన్న సంస్థ. నీలిట్ సంస్థ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో అవసరమైన విద్య, శిక్షణ, పరీక్షల నిర్వహణ, సర్టిఫికేషన్ నిర్వహిస్తారు. నీలిట్ స్కిల్ డెవలప్మెంట్లో మంచి పేరు సాధించగా.. కేంద్ర విద్యాశాఖ నీలిట్కి డీమ్డ్ టు బి యూనివర్సిటీ హోదా కూడా కల్పించింది. ఏపీ ప్రభుత్వం ఢిల్లీలో 2026 ఫిబ్రవరి 27 జరిగిన ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో నీలిట్ అమరావతిలో క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు ఎంవోయూ చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ ప్రస్థానంలో అమరావతి నీలిట్ కీలకంగా మారుతుందని భావిస్తున్నారు.
అమరావతిలో ఏర్పాటు కానున్న నీలిట్ క్యాంపస్ను క్వాంటమ్, ఏఐ, సెమీ కండక్టర్ టెక్నాలజీల్లో రీసెర్చ్, ట్రైనింగ్కు సంబంధించి నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్గా అభివృద్ధి చేస్తారు. డిప్లొమా, యూజీ, పీజీ, పీహెచ్డీ, ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్ అండ్ సెక్యూరిటీ, డేటా సైన్స్ సహా మరికొన్ని ప్రోగ్రామ్స్ అందుబాటులో ఉంటాయి. అలాగే లేటెస్ట్ రీసెర్చ్ సెంటర్లు ఉంటాయి.. డీప్టెక్లో స్టార్టప్స్, ఇతర సంస్థలకు అవసరమైన సహకారం అందిస్తారు. గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో నీలిట్ ఈ ఏడాది సెప్టెంబరు నుంచే తాత్కాలికంగా కార్యకలాపాలు ప్రారంభించనుంది. మొత్తం మీద నీలిట్ ఏర్పాటు అమరావతిలో ఓ మైలురాయిగా చెప్పొచ్చు.

