
డాక్టర్ ప్రియాంక కేసులో ప్రభుత్వ వ్యవస్థలు, పోలీసు యంత్రాంగం నిర్వీర్యమైన తీరు మరోసారి బయటపడిందని జగన్ విమర్శించారు. డాక్టర్ ప్రియంక కేసులో వ్యవస్థల తప్పులను ఎత్తిచూపుతూ సోషల్మీడియాలో ప్రశ్నిస్తుంటే, వాటికి సమాధానాలు చెప్పలేక ఆ కంటెంట్ను కూడా చంద్రబాబు, తన ప్రభుత్వ పోలీసులతో నిమిషాల వ్యవధిలో వాటిని తొలగిస్తున్నారని మండిపడ్డారు.
రాజమండ్రిలో మెడికల్ పీజీ విద్యార్థిని డాక్టర్ ప్రియాంక మృతి తనను తీవ్రంగా కలచివేసిందని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ప్రియాంకను వైద్యురాలిగా తీర్చిదిద్దేందుకు ఆమె తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు, త్యాగాలు చేశారని పేర్కొన్నారు. ఎండీ చదువులు కొనసాగిస్తున్న సమయంలో ఆమె మృతి చెందడం అత్యంత విషాదకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కష్ట సమయంలో ఆమె కుటుంబానికి భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని కోరుతూ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
డాక్టర్ ప్రియాంక కేసు ప్రభుత్వ, పోలీసు వ్యవస్థల పనితీరును మరోసారి ప్రశ్నించేలా ఉందని జగన్ విమర్శించారు. ప్రతిపక్షాలు, ప్రభుత్వాన్ని ప్రశ్నించే వ్యక్తులపై చట్టాన్ని ఉల్లంఘిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న ప్రభుత్వం.. సామాన్యులకు సంబంధించిన కేసుల్లో మాత్రం చట్టాన్ని సమర్థంగా అమలు చేయడంలో విఫలమవుతోందని ఆరోపించారు.
ప్రమాదంగా చూపించి వదిలేశారా?
ఆగస్టు 3వ తేదీ రాత్రి ఘటన జరిగిందని, అది ఓ షాపింగ్ మాల్ గేటు సమీపంలోనే చోటుచేసుకుందని జగన్ పేర్కొన్నారు. ఘటనలో నిందితులు మద్యం సేవించి ఉన్నట్లు తెలిసినప్పటికీ.. వెంటనే సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి, ఘటన తీవ్రతకు అనుగుణంగా కేసు నమోదు చేయాల్సిన పోలీసులు దానిని సాధారణ ప్రమాదంగా పరిగణించారని ఆరోపించారు.
నిందితుల కారు డాక్టర్ ప్రియాంక ప్రయాణిస్తున్న స్కూటర్ను ఢీకొట్టడంతో పాటు.. అనంతరం ఆమెపై నుంచి కారును నడిపిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయని జగన్ అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనూ పోలీసు వ్యవస్థ ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించిందనే దానిపై సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేశారు.
డాక్టర్ ప్రియాంక కుటుంబానికి జరిగిన అన్యాయంపై ప్రభుత్వం, పోలీసు శాఖ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని జగన్ అన్నారు. ఆమె తండ్రి ఆవేదనకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

