
భారత పురుషుల క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలం సెప్టెంబర్ 2026తో ముగియనుండటంతో అతడి భవిష్యత్తుపై ఉత్కంఠ నెలకొంది. ఇటీవల ఇంగ్లాండ్ పర్యటన సమయంలో రోహిత్ శర్మ వన్డే భవిష్యత్తుపై తలెత్తిన వివాదాల కారణంగా బీసీసీఐ అతడి కాంట్రాక్ట్ను పొడిగించేందుకు సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. ఒకవేళ అగార్కర్ను తప్పిస్తే, అతని స్థానంలో భారత మాజీ దిగ్గజ బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్ను చీఫ్ సెలెక్టర్గా నియమించాలని బోర్డు యోచిస్తోందట.
భారత క్రికెట్ నియంత్రణ మంఢలి చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపుపై సంశయం వ్యక్తమవుతోంది. అగార్కర్ కాంట్రాక్ట్ వచ్చే సెప్టెంబర్తో ముగియనుంది. సాధారణంగా 2027 వన్డే ప్రపంచకప్ వరకు అతడి సేవలను కొనసాగిస్తారని ప్రచారం జరిగినప్పటికీ, ఇటీవల ఇంగ్లాండ్ పర్యటనలో జరిగిన పరిణామాల పట్ల బీసీసీఐ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అగార్కర్.. పదవిని ఓసారి పొడిగించారు. ఈ క్రమంలో సెప్టెంబర్లో జరగబోయే బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.
అయితే అగార్కర్ను పూర్తిగా పక్కన పెట్టేశారని చెప్పలేం. ఎందుకంటే అగార్కర్ హయాంలో భారత్.. మంచి విజయాలు అందుకుంది. 2023లో బాధ్యతలు చేపట్టిన అగార్కర్ హయాంలో.. టీమిండియా 2024, 2026 టీ20 ప్రపంచకప్లతో పాటు 2025 ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. దీంతో మూడేళ్లలో మూడు ఐసీసీ టైటిల్స్ అందుకుంది. అంతేకాకుండా రోహిత్, కోహ్లీ (టెస్టులు, టీ20లు), అశ్విన్, పూజారా, రహానే, జడేజా (టీ20లు) వంటి ప్లేయర్లు రిటైర్మెంట్ పలికినా.. జట్టు కూర్పును సెట్ చేశాడనే పేరు అగార్కర్కు ఉంది.
శ్రీలంకతో జరగబోయే రెండు టెస్టుల సిరీస్ ఫలితాలు అగార్కర్ భవిష్యత్తును నిర్ణయించడంలో కీలకం కానున్నాయి. 2027 వన్డే వరల్డ్ కప్ వరకు తనే కొనసాగాలని అగార్కర్ భావిస్తున్నప్పటికీ, సెప్టెంబర్లో జరిగే ఏజీఎం సమావేశం తర్వాతే ఈ విషయంపై స్పష్టత రానుంది. ఒకవేళ లక్ష్మణ్ బాధ్యతలు స్వీకరిస్తే భారత క్రికెట్ సెలెక్షన్లో సరికొత్త అధ్యాయం ప్రారంభమైనట్లే.

