
దేశంలోని పలుచోట్ల కొవిడ్-19 కేసులు నమోదవుతుండటంతో ప్రజల్లో మరోసారి కరోనా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ప్రస్తుతం ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అప్రమత్తంగా ఉంటూ కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని సూచిస్తున్నారు.
జూన్ 26 నుంచి జులై 16 వరకు ఆంధ్రప్రదేశ్లో మొత్తం 12 మందికి కొవిడ్-19 పాజిటివ్ నిర్ధారణ అయింది. వీరిలో నలుగురు మృతి చెందారు. అయితే ఈ నలుగురికీ ఇప్పటికే అధిక రక్తపోటు, మధుమేహం, మూత్రపిండాల సమస్యలు వంటి ఇతర తీవ్రమైన అనారోగ్యాలు కూడా ఉన్నాయని ఆరోగ్య శాఖ తెలిపింది.
దేశవ్యాప్తంగా జులై నెలలో ఇప్పటి వరకు మొత్తం 339 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్య నిపుణుల ప్రకారం. ప్రస్తుతం దేశంలో కొత్త కరోనా వేవ్కు సంబంధించిన సంకేతాలు లేవు. అందువల్ల ప్రజలు భయపడకుండా అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
కొవిడ్, ఫ్లూ లక్షణాలు దాదాపు ఒకేలా ఉంటాయని తెలిపారు. జ్వరం, ఒళ్లునొప్పులు, అలసట, గొంతునొప్పి, ముక్కు కారడం వంటి లక్షణాలు కనిపిస్తే పరీక్ష చేయించుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. జ్వరం మూడు నుంచి ఐదు రోజులకుపైగా కొనసాగినా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులని సంప్రదించాలని సూచించారు.

