
సాధారణంగా స్టార్ హోటళ్లలో ఆహార నాణ్యత, పరిశుభ్రత విషయంలో కఠినమైన ప్రమాణాలు పాటిస్తారని భావిస్తాం. కానీ బెంగళూరులోని కొన్ని ప్రముఖ త్రీ స్టార్, ఫైవ్ స్టార్ హోటళ్లలో ఇందుకు విరుద్ధమైన పరిస్థితులు వెలుగుచూశాయి. తాజ్ యశ్వంత్పూర్, షాంగ్రి-లా వంటి హోటళ్లలో తనిఖీల సందర్భంగా పలు తీవ్రమైన ఆహార భద్రతా ఉల్లంఘనలు గుర్తించినట్లు సమాచారం.
కొన్ని చోట్ల పాడైన, గడువు ముగిసిన కూరగాయలు, మాంసం, పాలు, ఇతర ఆహార పదార్థాలను వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాదు, కర్ణాటక అసెంబ్లీలోని ఎమ్మెల్యేల క్యాంటీన్లలోనూ గడువు ముగిసిన ఆహార పదార్థాలు బయటపడటం కలకలం రేపింది. కిచెన్ పరిసరాల్లో బొద్దింకలు కనిపించడం మరింత ఆందోళన కలిగించింది.
ప్రముఖ హోటళ్లు, ప్రజాప్రతినిధుల క్యాంటీన్లలోనే ఇలాంటి పరిస్థితులు వెలుగుచూడటంతో ఆహార భద్రతా ప్రమాణాల అమలుపై తీవ్ర ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
కర్ణాటకలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం బెంగళూరులోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
విధాన సౌధ పరిసరాల్లోని క్యాంటీన్లు, రెస్టారెంట్లలో ఆరోగ్య శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా విధాన సౌధ సమీపంలోని లెజిస్లేటర్స్ హౌస్లో ఉన్న మల్లిగె హోటల్పై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. హోటల్ వంటగది అత్యంత అపరిశుభ్రంగా ఉండటంతో పాటు, అక్కడ బొద్దింకలు సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
అంతేకాదు.. కిచెన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాలు కూడా ఉన్నట్లు తనిఖీల్లో వెల్లడైనట్టు సమాచారం. ప్రజాప్రతినిధులు, సిబ్బంది వినియోగించే ప్రాంతాల్లోనే ఇలాంటి అపరిశుభ్ర పరిస్థితులు వెలుగుచూడటంతో ఆహార భద్రతా ప్రమాణాల అమలుపై ఆందోళన వ్యక్తమవుతోంది.
ఫుడ్ సేఫ్టీ నిబంధనలను పాటించకపోవడంతో పాటు కీటకాల నివారణకు అవసరమైన చర్యలు కూడా చేపట్టలేదని తనిఖీల్లో అధికారులు గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా హోటళ్లు, రెస్టారెంట్లలో నిర్వహిస్తున్న ప్రత్యేక తనిఖీల్లో భాగంగానే ఈ పరిశీలనలు చేపట్టారు.
ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఆరోగ్య శాఖకు చెందిన సొంత క్యాంటీన్ను కూడా అధికారులు తనిఖీ చేయడం. బెంగళూరులోని మగాది రోడ్డులో ఉన్న ఆరోగ్య సౌధ క్యాంటీన్లో అపరిశుభ్ర పరిస్థితులు కనిపించడంతో పాటు, గడువు ముగిసిన ఇడ్లీ రవ్వ, కొబ్బరి పొడి వంటి ఆహార పదార్థాలను వినియోగిస్తున్నట్లు గుర్తించారు.
ఆహార పదార్థాలను నిల్వ చేయడంలో నిర్దేశిత విధివిధానాలను పాటించలేదని, కీటకాల నియంత్రణకు అవసరమైన పెస్టిసైడ్ చర్యలు కూడా చేపట్టలేదని అధికారులు తమ నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. దీంతో ఆహార భద్రతా ప్రమాణాల అమలుపై మరోసారి ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

