
మనకు ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా వెంటనే ప్రైవేట్ ఆస్పత్రికో లేక ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరకో వెళ్తారు. అంతేకానీ పేదవాడికి అందుబాటులో ఉండే ప్రభుత్వ వైద్యశాల వైపు మాత్రం చూడరు. ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లి వేలాది రూపాయలు వదిలించుకుంటుంటారు. కానీ.. ప్రభుత్వ వైద్యశాలల్లోనూ నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. 60 రకాలకు పైగా వైద్య పరీక్షలు ఉచితంగా ప్రభుత్వ వైద్యశాలలో చేస్తారని చాలా తక్కువ మందికే తెలసు. ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని వైద్యులు కోరుతున్నారు.
ప్రభుత్వ వైద్యశాలంటేనే చాలా మందికి చులకన. ఆ అక్కడ ఏం ఉంటాయి.. డాక్టర్ చూస్తాడు, మందుల చీటి రాసిస్తాడు అంతేగా. ఏదైనా టెస్టులు చేయించుకోవాలంటే బయటకే వెళ్లాలిగా అనుకుని ప్రైవేట్ ఆస్పత్రికో, ఆర్ఎంపీ దగ్గరకో వెళ్లి డబ్బులు వదిలించుకుంటుంటారు. అయితే, ప్రభుత్వ ఆస్పత్రులయిన పీహెచ్సీ, యూపీహెచ్సీల్లో 60 రకాల నాణ్యమైన ఆధునిక వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తున్నారన్న విషయం చాలా మందికి తెలియదు.
సామాన్యులకు ప్రభుత్వ వైద్యశాల ఎన్నో నాణ్యమైన సేవలు అందిస్తుంది. కానీ, వాటిపై అవగాహన లేక ప్రైవేట్ ఆస్పత్రుల వైపు వెళ్తుంటారు. గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఇచ్చే ముందులు ఎంతో మన్నికమైనవి.. రోగాలను నయం చేసేవి కూడా ఉంటాయి. కానీ, కేవలం అవగాహన లేకనే అందరూ ప్రైవేట్ ఆస్పత్రుల వైపు వెళ్తుంటారు.
కేవలం వైద్య పరీక్షలే కాకుండా పాముకాటు, కుక్కకాటు బాధితులకు ప్రభుత్వ వైద్యశాలల్లోనే మంచి వ్యాక్సిన్ సౌకర్యం కూడా ఉంటుంది. సీజనల్ వ్యాధులు, వైరల్ ఇన్ఫెక్షన్స్, గర్భిణులకు ప్రత్యేక వైద్య సేవలు కూడా ప్రభుత్వ వైద్యశాలలో అందిస్తుంటారు. ప్రభుత్వ హాస్పిటళ్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకునే దిశగానూఏపీ సర్కారు కార్యచరణ మొదలుపెట్టింది.
ప్రభుత్వ వైద్యశాలలో నాణ్యమైన వైద్యం అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు కూడా తీసుకుంటున్నాయి. పీహెచ్సీ, యూపీహెచ్సీ, సీహెచ్సీల్లో 60 రకాల పరీక్షలు అందుబాటులోకి తీసుకొచ్చాయి. క్షయ, హెచ్ఐవీ, మలేరియా, షుగర్ నిర్ధారణ, లిపిడ్ ప్రొఫైల్, హెపటైటిస్ వంటి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లలో వేలాది రూపాయలు ఖర్చు చేసి చేయించుకునే వైద్య పరీక్షలు ఇక్కడ ఉచితంగానే చేస్తారు. ప్రభుత్వ ఆసుప్రతులపై ప్రజలకు నమ్మకం కలిగించేందుకు ఇటీవలి కాలంలో కలెక్టర్ లాంటి ఉన్నతాధికారులు సర్కారు దావఖానాల్లో వైద్యం చేయించుకుంటున్నారు.

