
హైదరాబాద్లో ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు ప్రధాన ప్రాంతాల్లోని రహదారులను నో టాలరెన్స్ జోన్లుగా ప్రకటించాలని అధికారులు ప్రతిపాదించారు. అక్రమ పార్కింగ్పై కఠిన చర్యలు, మల్టీలెవల్ పార్కింగ్ కాంప్లెక్స్లు, స్కైవాక్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, రహదారి విస్తరణ, యూటర్న్ల వద్ద బారికేడ్లు, పాదచారుల కాలిబాటల నిర్మాణం వంటి చర్యలపై హుమ్టా సమావేశంలో చర్చించారు. నగర ట్రాఫిక్ నిర్వహణను ఆధునికీకరించి ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే ఈ ప్రణాళికల ప్రధాన లక్ష్యంగా అధికారులు పేర్కొన్నారు.
హైదరాబాద్ నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి శాశ్వత పరిష్కారం చూపే దిశగా అధికారులు కీలక చర్యలకు శ్రీకారం చుట్టారు. ప్రధాన రహదారులపై ఇష్టారాజ్యంగా వాహనాలను నిలిపివేయడాన్ని అరికట్టేందుకు నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతాలను నో టాలరెన్స్ జోన్లుగా ప్రకటించే ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చారు. ఈ జోన్లలో రహదారులపై వాహనాలు నిలిపితే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు, మున్సిపల్ అధికారులు నిర్ణయించారు. ట్రాఫిక్కు ఆటంకం కలిగించే అక్రమ పార్కింగ్ను పూర్తిగా నియంత్రించడం ద్వారా నగరంలో వాహనాల రాకపోకలను వేగవంతం చేయడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశంగా అధికారులు పేర్కొంటున్నారు.
పురపాలక శాఖ ఆదేశాల మేరకు బుధవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ ఆర్వీ కర్ణన్ అధ్యక్షతన హైదరాబాద్ యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (హుమ్టా) వర్కింగ్ గ్రూప్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నగర ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్, హుమ్టా ఎండీ బి. జీవన్బాబు, జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ పరిధిలోని జోనల్ అధికారులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నగర ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు అమలు చేయాల్సిన పలు ప్రణాళికలపై విస్తృతంగా చర్చించారు. ట్రాఫిక్ నిర్వహణలో భాగంగా రద్దీ ప్రాంతాల్లో ఆధునిక పార్కింగ్ సదుపాయాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. చార్మినార్ బస్టాండ్ వద్ద నిర్మిస్తున్న మల్టీలెవల్ పార్కింగ్ కాంప్లెక్స్ తరహాలో నెక్లెస్ రోడ్తో పాటు ఇతర రద్దీ ప్రాంతాల్లో కూడా పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో మల్టీలెవల్ పార్కింగ్ కాంప్లెక్స్ల నిర్మాణానికి అనువైన స్థలాలను గుర్తించాలని సూచించారు. దీంతో రహదారులపై అక్రమ పార్కింగ్ తగ్గి ట్రాఫిక్ ప్రవాహం మెరుగుపడుతుందని అధికారులు భావిస్తున్నారు.
పాదచారుల భద్రతకు కూడా ప్రాధాన్యం ఇస్తూ పలు కొత్త ప్రతిపాదనలు చేశారు. ఆరాంఘర్ చౌరస్తాలో స్కైవాక్నిర్మించడంతో పాటు బండ్లగూడ ఆరె మైసమ్మ దేవాలయం వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించనున్నారు. అత్తాపూర్ నుంచి ఆరాంఘర్ వరకు రహదారిని విస్తరించి సర్వీస్ రోడ్లను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. అలాగే మెహిదీపట్నం నుంచి పంజాగుట్ట మీదుగా కూకట్పల్లి వరకు, మరోవైపు నానల్నగర్ నుంచి టోలిచౌకి వరకు రహదారి ఆక్రమణలను తొలగించి పాదచారుల కోసం నిరంతర కాలిబాటలను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు.

