
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రంయ ప్రారంభోత్సవం అనంతరం నిర్వహించిన సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమోషనల్ అయ్యారు. దేశం కోసం కష్టపడుతున్న ప్రధాని నరేంద్ర మోదీని కొందరు దూషించడం తనకు ఎంతో బాధ కలిగిచిందన్నారు. ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఆయన ధైర్యంగా ముందుకు సాగుతున్నారంటూ ప్రశంసించారు. ఆయనకు అందరం అండగా నిలబడాలని పిలుపునిచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని వికసిత్ భారత్ దిశగా నడిపిస్తున్న గొప్ప వ్యక్తి అంటూ ప్రశంసించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ . దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడం ఎంత కష్టమో ప్రజలు కూడా ఆలోచించాలన్నారు. మన దేశం కోసం కష్టపడి పనిచేస్తున్న ప్రధాని ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారని.. ఇటీవల ఢిల్లీ జంతర్మంతర్ల మోదీని కొందరు విమర్శిస్తుంటే చాలా బాధపడినట్లు చెప్పుకొచ్చారు. ప్రధానిని అనకూడని మాటలు అంటుంటే తన గుండె కదిలిందని.. తనకు కన్నీళ్లు వచ్చాయని ఎమోషనల్ అయ్యారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ బహిరంగ సభలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు.
దేశం కష్టపడిన వ్యక్తికి ఏం ఇవ్వగలమని.. కొత్త తరానికి ఆయన గురించి ఏమి తెలుసు అని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్. ప్రధాని మోదీ ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా కష్టపడుతున్నారన్నారు. ఓవైపు శత్రు దేశాలతో పోరాడాలి.. అంతర్గత శత్రువులతో పోరాడుతున్నారని వ్యాఖ్యానించారు. నేటి యువతకు తల్లిదండ్రులు సరైన సంస్కారం నేర్పించాలని హితవు పలికారు. ప్రధాని మోదీ ఎన్ని బాధలు పడ్డా, ఆయన్ను వెనక్కి లాగుతున్నా ఎక్కడా భయపడలేదన్నారు. పండ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు సహజమేనని.. ఆయనకు మాత్రం తనను దూషించినవారిని కూడా క్షమించే గొప్ప గుణం ఉందన్నారు. ఇలాంటి ప్రధాని ఉండటం అందరికి అదృష్టమన్నారు. స్వయంగా నరేంద్ర మోదీ తనంతట తానే అధికారం వద్దనుకుంటే వదలాలి తప్ప.. అప్పటి వరకు దేశ పరిపాలన పగ్గాలు ఆయన చేతుల్లో ఉండేందుకు అందరం కృషి చేస్తామన్నారు.
ప్రధాని మోదీని మించిన నేత మరొకరు లేరని.. దేశం కోసం పని చేస్తున్న నేతకు అండగా నిలబడితే ఏం జరుగుతుందో.. భోగాపురం ఎయిర్ పోర్టే నిదర్శనంగా నిలిచిందన్నారు పవన్ కళ్యాణ్. ప్రధాని మోదీ 140 కోట్లమంది ప్రజల ఆకాంక్షలను సాకారం చేస్తున్నారని ప్రశంసించారు. ప్రధానికి దేశ ప్రగతికి మౌలిక వసతుల కల్పనే కీలకమని తెలుసని.. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చారన్నారు. ప్రధాని విశాఖపట్నం రైల్వే జోన్తో పాటు భోగాపురం ఎయిర్పోర్ట్తో ఇక్కడి ప్రజల దశాబ్దాల ఆకాంక్షలను నెరవేర్చారన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భోగాపురం ఎయిర్పోర్ట్ సరికొత్త అధ్యాయమని.. చంద్రబాబు మార్గదర్శకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రగామిగా అభివృద్ధి చెందుతోందన్నారు పవన్ కళ్యాణ్.

