
ఫేస్బుక్ ద్వారా మహిళలతో పరిచయం పెంచుకుని లైంగిక వేధింపులు, బెదిరింపులు, డబ్బుల వసూళ్లకు పాల్పడిన ఎస్సై కదిరే శ్రీకాంత్ను హనుమకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సాంకేతిక ఆధారాలతో నిందితుడిని నిజామాబాద్లో అదుపులోకి తీసుకున్నారు. గతంలో మరో మహిళను పెళ్లి పేరుతో మోసం చేసిన కేసు కూడా అతడిపై నమోదై ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కోర్టు అతడికి 14 రోజుల రిమాండ్ విధించింది.
సమాజానికి రక్షణ కల్పించాల్సిన ఓ పోలీసు అధికారి సోషల్ మీడియాను అడ్డాగా మార్చుకుని మహిళలను లక్ష్యంగా చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. ఫేస్బుక్ ద్వారా మహిళలతో పరిచయం పెంచుకుని.. వారి వ్యక్తిగత పరిస్థితులను ఆసరాగా చేసుకుని లైంగిక వేధింపులు, బెదిరింపులు, డబ్బుల వసూళ్లకు పాల్పడిన సబ్ ఇన్స్పెక్టర్ కదిరే శ్రీకాంత్ను హనుమకొండ సుబేదారి పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం అతడికి 14 రోజుల రిమాండ్ విధించడంతో జైలుకు తరలించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలానికి చెందిన కదిరే శ్రీకాంత్ 2014 బ్యాచ్కు చెందిన సబ్ ఇన్స్పెక్టర్. పెళ్లి అయిన ఎస్సై శ్రీకాంత్.. సోషల్ మీడియా ద్వారా మహిళలకు ఫ్రెండ్ రిక్వెస్టులు పంపించి.. వారితో పరిచయాలు పెంచుకునేవాడని పోలీసులు వెల్లడించారు. 2025లో ఫేస్బుక్ ద్వారా ఓ మహిళతో పరిచయం ఏర్పరచుకుని.. ఆ తర్వాత ఆమెతో సన్నిహిత సంబంధాలు కొనసాగించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. జమ్మికుంటలో విధులు నిర్వహిస్తున్న సమయంలో బాధితురాలి వ్యక్తిగత పరిస్థితులను ఆసరాగా చేసుకుని.. ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
అంతటితో ఆగకుండా బాధితురాలి పర్సనల్ ఫొటోలు, వీడియో కాల్స్ను అడ్డంగా పెట్టుకుని ఆమెపై ఎస్సై శ్రీకాంత్ బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఆమెను డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడం, ఇచ్చిన డబ్బులను తిరిగి అడిగితే చంపేస్తానని బెదిరించడం వంటి ఆరోపణలు కూడా వెలుగులోకి వచ్చాయి. దీంతో ఎస్సై శ్రీకాంత్ తీరుపై తీవ్రంగా విసిగిపోయిన బాధితురాలు.. సుబేదారి పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

