
న్యూఢిల్లీ: దేశంలో ధరలు మళ్లీ కొండెక్కాయి. ఈ ఏడాది జూన్లో వినియోగదారుల ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 6 నెలల గరిష్ఠ స్థాయి 4.38 శాతానికి ఎగబాకింది. ఆహార ధరలు గణనీయంగా పెరగడం ఇందుకు ప్రధాన కారణం. ఆర్బీఐకి ప్రభుత్వం నిర్దేశించిన నియంత్రణ లక్ష్యమైన 4 శాతం పైకి ద్రవ్యోల్బణం చేరడం 17 నెలల తర్వాత మళ్లీ ఇదే మొదటిసారి. అంతేకాదు, 2024 ఆధార సంవత్సరంతో ఈ జనవరిలో ప్రవేశపెట్టిన కొత్త సిరీ్సలో ద్రవ్యోల్బణం 4 శాతం దాటడం కూడా ఇదే తొలిసారి. ఈ మే నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 3.93 శాతంగా నమోదైంది.
5.32 శాతానికి ఆహార ద్రవ్యోల్బణం…
జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) సోమవారం విడుదల చేసిన డేటా ప్రకారం.. ఈ మే నెలలో 4.78 శాతంగా ఉన్న ఆహార ధరల ద్రవ్యోల్బణం జూన్లో 5.32 శాతానికి పెరిగింది. గత నెలలో వెండి, బంగారం, వజ్రాలు మరియు ప్లాటినం ఆభరణాలు, అల్లం, టమాట, కిస్మిస్, కూరగాయల ధరల్లో వార్షిక ప్రాతిపదికన అత్యధిక పెరుగుదల నమోదైంది. కాగా, బంగాళదుంపలు, బఠానీలు, మోటార్ కార్, జీప్, జీరా, మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ల ధరల్లో అత్యధిక తగ్గుదల నమోదైంది. దేశంలో సగానికి పైగా (18) రాష్ట్రాల్లో రిటైల్ ద్రవ్యోల్బణం 4 శాతం ఎగువనే నమోదైంది. అన్ని రాష్ట్రాల్లోకెల్లా తెలంగాణలో అత్యధికంగా 6.36 శాతంగా. ఆంధ్రప్రదేశ్, పుదుచ్ఛేరిలో 5.39 శాతం చొప్పున నమోదైంది. మిజోరాంలో అత్యల్పంగా 1.63 శాతంగా ఉంది.

