
ఉచిత పథకాల అమలు, ప్రభుత్వ పాలనా తీరుపై తెలంగాణ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఉచిత పథకాలు, రైతుబంధు వంటి కార్యక్రమాల వల్ల అర్హులతో పాటు ఆర్థికంగా ఉన్నవారు కూడా లబ్ధి పొందుతుండటం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. ఉచితాలతో కూలీలు దొరకక రైతుల పరిస్థితి ఘోరంగా తయారైందని.. జనం పని మానేసే రోజులు వస్తాయని హెచ్చరించింది. సుమారు 1.15 కోట్ల కుటుంబాలకు ఉచితాలు ఇస్తే రాష్ట్రాన్ని ఎలా నడుపుతారని ప్రశ్నించింది.
రాష్ట్రంలో అమలు జరుగుతున్న ఉచిత పథకాలు , ప్రభుత్వ పాలనా తీరు, సంక్షేమ పథకాల వర్గీకరణపై తెలంగాణ హైకోర్టు శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక కేసు విచారణ సందర్భంలో తెలంగాణ హైకోర్టు జస్టిస్ నగేష్ భీమపాక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పరిస్థితులు, సమాజంలో భవిష్యత్తులో ఎదురయ్యే ప్రమాదకర పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్లు జస్టిస్ నగేష్ భీమపాక స్పష్టం చేశారు. ఉచిత పథకాలు, సంక్షేమ కార్యక్రమాల ప్రయోజనాలను నిజమైన పేదలతో పాటు కోటీశ్వరులు, ధనికులు కూడా పొందుతుండటం వల్ల ప్రభుత్వంపై విపరీతమైన ఆర్థిక భారం పడుతోందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
రైతుల మేలు కోసం వారికి పంట పెట్టుబడి సాయం అందించేందుకు తీసుకొచ్చిన రైతుబంధు వంటి పథకాలు ఎంతో మంచివే అయినప్పటికీ.. వాటిని సరైన అర్హులకు అందించకపోవడం వల్ల సంపన్నులు కూడా ఉచితంగా లబ్ధి పొందుతున్నారని హైకోర్టు ప్రస్తావించింది. ప్రతిదీ ఉచితంగా లభిస్తుండటంతో తానెందుకు పనిచేయాలి అనే ధోరణి ప్రజల్లో పెరుగుతోందని పేర్కొంది. ఈ ప్రభావంతో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయానికి, ఇతర పనులకు కూలీలు దొరకని పరిస్థితి నెలకొందని.. దాంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జస్టిస్ నగేష్ భీమపాక ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలాగే ఉచితాల సంస్కృతిని కొనసాగిస్తూ పోతే చివరికి కుబేరుడి వద్ద ఉన్న ధనమంతా ఖర్చయిపోయి.. ఆయన కూడా పనికి ఆహార పథకం కింద కూలీ పనులకు రావాల్సిన పరిస్థితి వస్తుందని తీవ్ర హెచ్చరికలు చేశారు. దేశ పౌరుల సామాజిక బాధ్యత గురించి మాట్లాడిన జస్టిస్ నగేష్ భీమపాక.. ఒకప్పుడు గాంధీ, నెహ్రూ, ప్రకాశం పంతులు వంటి మహనీయులను చూసి దేశానికి మనమేమి ఇచ్చామని ఆలోచించేవాళ్లమని.. కానీ ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారిపోయి ఈ దేశం మనకేమిచ్చింది, ప్రభుత్వం మనకేమిచ్చింది అనే ధోరణే సమాజంలో ఎక్కువైందని వ్యాఖ్యానించారు.

