
తమిళనాడు రాజకీయాల్లో ప్రత్యర్థులపై చర్యలు తీసుకోవడం కొత్త విషయం కాదు. అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ ప్రత్యర్థులపై కేసులు నమోదు చేయడం, అరెస్టులు జరగడం గతంలోనూ ఎన్నోసార్లు కనిపించింది. ఒకప్పుడు జయలలిత, కరుణానిధి కూడా ఇలాంటి రాజకీయ పరిణామాలను ఎదుర్కొన్నారు. ఇప్పుడు అదే తరహా పరిస్థితి డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్కు ఎదురైంది.
1996లో కలర్ టీవీ కుంభకోణం కేసులో అప్పటి మాజీ ముఖ్యమంత్రి జయలలిత అరెస్టయ్యారు. అనంతరం 2001లో ఫ్లైఓవర్ కుంభకోణం ఆరోపణల నేపథ్యంలో జయలలిత ప్రభుత్వ హయాంలో మాజీ సీఎం కరుణానిధిని అర్ధరాత్రి ఆయన నివాసంలోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు 2026లో కావేరీ అంశంపై నిర్వహించిన ర్యాలీ సందర్భంగా నటి త్రిషపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో సీఎం విజయ్ ప్రభుత్వం ఉదయనిధి స్టాలిన్ను అరెస్ట్ చేసింది.
ఉదయనిధి అరెస్ట్ తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. డీఎంకే కార్యకర్తలు, నాయకులు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగారు. అరెస్టు అనంతరం పార్టీ అధినేత ఎం.కే. స్టాలిన్ అత్యవసరంగా కీలక నేతలతో సమావేశమై తదుపరి కార్యాచరణపై చర్చించారు.
ఇదిలా ఉండగా, ఉదయనిధిని వెంటనే విడుదల చేయాలని మద్రాస్ హైకోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఆయనకు తక్షణమే స్టేషన్ బెయిల్ మంజూరు చేయాలని సూచించింది.
రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఈ అరెస్ట్ ద్వారా సీఎం విజయ్ ప్రభుత్వం చట్టానికి విరుద్ధంగా లేదా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామనే సంకేతాన్ని ఇచ్చినట్లు భావిస్తున్నారు. గతంలో కరుణానిధి, జయలలిత అరెస్టులు తమిళనాడు రాజకీయాల్లో ఎంతటి సంచలనంగా మారాయో, ఇప్పుడు ఉదయనిధి అరెస్ట్ కూడా అదే స్థాయిలో చర్చనీయాంశమైంది. చెన్నైలోని ఆయన నివాసంలో పోలీసులు అదుపులోకి తీసుకుని అనంతరం తంజావూర్కు తరలించారు. అరెస్టు సమయంలో తన భర్తకు కొంత సమయం ఇవ్వాలని ఉదయనిధి భార్య పోలీసులను కోరినప్పటికీ, అధికారులు తమ చర్యను కొనసాగించినట్లు సమాచారం.

