
జిల్లాలోని జమ్మలమడుగులో వైసీపీ చేపట్టిన నిరసన దీక్షల వద్ద మూడో రోజు ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. దీక్షలకు అనుమతి లేదంటూ పోలీసులు వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డికి నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ ఆయన మూడో రోజు దీక్షా శిబిరం వద్దకు చేరుకోవడంతో పోలీసులు అడ్డుకున్నారు. శిబిరం పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు.
ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డితో పాటు అక్కడికి చేరుకున్న వైసీపీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, వైసీపీ నాయకులు, కార్యకర్తలకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకోవడంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రామసుబ్బారెడ్డిని అదుపులోకి తీసుకునే సమయంలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.
ఆయన సతీమణి ఇందిరమ్మను కూడా పోలీసులు అక్కడి నుంచి తరలించారు. దీక్షలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేస్తూ శిబిరం వద్దకు ఎవరినీ అనుమతించకపోవడంతో వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. పోలీసులు, వైసీపీ కార్యకర్తల మధ్య జరిగిన తోపులాటతో ఉద్రిక్తత ఏర్పడింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డితో పాటు పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలను అక్కడి నుంచి తరలించారు.

