
హైదరాబాద్ నగరంలోని ఆర్టీసీ బస్సు ప్రయాణికుల కోసం మెట్రో తరహాలో బస్సు ఎక్కే ముందే టికెట్ కొనుగోలు చేసే అడ్వాన్స్ టికెటింగ్ విధానాన్ని మీ టికెట్ యాప్లో ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్లో రోజూ 26 లక్షల మంది ప్రయాణికుల్లో 23 శాతం మంది డిజిటల్ చెల్లింపులు చేస్తున్నారు. ఇప్పటికే డిజిటల్ బస్పాస్లకు మంచి స్పందన లభించగా.. త్వరలో విద్యార్థులకు కూడా డిజిటల్ బస్పాస్లు అందుబాటులోకి రానున్నాయి. దీంతో ప్రయాణికులకు, కండక్టర్లకు మరింత సౌలభ్యం కలగనుంది.
హైదరాబాద్ నగర ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన, వేగవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు టీజీఎస్ఆర్టీసీ సరికొత్త డిజిటల్ సేవలనుఅందుబాటులోకి తీసుకురానుంది. హైదరాబాద్ మెట్రో తరహాలో బస్సు ఎక్కే ముందే టికెట్ కొనుగోలు చేసే అడ్వాన్స్ లేదా బోర్డింగ్ టికెటింగ్ విధానాన్ని త్వరలో అమలు చేయాలని సంస్థ కసరత్తు చేస్తోంది. ఈ సదుపాయాన్ని ఇప్పటికే అందుబాటులో ఉన్న మీ టికెట్ మొబైల్ యాప్లోనే ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. అదే సమయంలో విద్యార్థులకు డిజిటల్ బస్పాస్లను కూడా అందుబాటులోకి తీసుకురావడానికి అధికారులు చర్యలు వేగవంతం చేస్తున్నారు.
ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టీజీఎస్ఆర్టీసీకి చెందిన 3200కు పైగా బస్సులు నిత్యం సేవలు అందిస్తున్నాయి. వీటి ద్వారా రోజుకు సుమారు 26 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. వీరిలో దాదాపు 70 శాతం మంది మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం కింద ప్రయాణిస్తున్న మహిళలే. అయినప్పటికీ ప్రతి రోజు సంస్థకు సుమారు రూ.6.5 కోట్ల ఆదాయం లభిస్తోంది. ఇందులో 23 శాతం వరకు డిజిటల్ చెల్లింపుల ద్వారానే సమకూరుతున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. కొత్త అడ్వాన్స్ టికెటింగ్ విధానం అమల్లోకి వస్తే డిజిటల్ లావాదేవీల శాతం మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం ఉదయం, సాయంత్రం రద్దీ సమయాల్లోబస్సుల్లో నిల్చుని ప్రయాణించే ప్రయాణికులకు టికెట్ తీసుకోవడం ఇబ్బందిగా మారుతోంది. కండక్టర్లు కూడా అధిక రద్దీ మధ్య నగదు, డిజిటల్ చెల్లింపులు నిర్వహించాల్సి వస్తుండటంతో టికెట్ల జారీలో ఆలస్యం జరుగుతోంది. కొన్నిసార్లు యూపీఐ లేదా ఇతర డిజిటల్ చెల్లింపుల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడం వల్ల బస్సుల షెడ్యూల్పైనా ప్రభావం పడుతోంది. ఈ సమస్యలకు పరిష్కారంగా అడ్వాన్స్ టికెటింగ్ విధానం ఉపయోగపడనుంది. కొత్త విధానంలో ప్రయాణికులు తమ మొబైల్లోని మీ టికెట్ యాప్ ద్వారా ఎక్కే బస్టాప్, దిగే గమ్యస్థానాన్ని ఎంపిక చేసుకుని యూపీఐ, డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల ద్వారా ముందుగానే టికెట్ కొనుగోలు చేయవచ్చు. టికెట్ బుక్ అయిన తర్వాత యాప్ ద్వారా బస్సు లైవ్ లొకేషన్ను ట్రాక్ చేస్తూ.. టికెట్లో పేర్కొన్న సమయానికి అనుగుణంగా ప్రయాణాన్ని ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీంతో ప్రయాణికుల సమయం ఆదా కావడంతో పాటు కండక్టర్లపై పని భారం కూడా తగ్గనుంది.

