
వివిధ రాష్ట్రాల్లో వరుస చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు సభ్యుల అంతర్రాష్ట్ర దొంగల ముఠాను ఆదిలాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరు బంగ్లాదేశ్కు చెందిన అక్రమ చొరబాటుదారులు కాగా.. మరొకరు భోపాల్కు చెందిన వ్యక్తి. బంగ్లాదేశీయుల్లో ఒకరు ఏజెంట్ల సహాయంతో నకిలీ గుర్తింపు పత్రాలు సృష్టించినట్లు పోలీసులు గుర్తించారు. జూలై 25న ఓ కాంగ్రెస్ నేత ఇంట్లో జరిగిన చోరీ కేసును ఛేదించిన పోలీసులు.. నిందితుల నుంచి 73 గ్రాముల బంగారం, వెండి, ఐఫోన్లు, బైక్, నగదును స్వాధీనం చేసుకున్నారు.
వివిధ రాష్ట్రాల్లో వరుస ఇళ్ల చోరీలకు పాల్పడుతూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా గుట్టును ఆదిలాబాద్ జిల్లా పోలీసులు రట్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. జూలై 25న రాత్రి ఆదిలాబాద్లోని మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని కైలాష్నగర్లో ఉన్న కాంగ్రెస్ నాయకుడు కంది శ్రీనివాస్ నివాసంలో భారీ చోరీ జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ దృశ్యాలు, ఇతర సాంకేతిక ఆధారాల సహాయంతో దర్యాప్తు వేగవంతం చేశారు. జిల్లా సరిహద్దుల్లో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 8 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 73 గ్రాముల బంగారం, 151 గ్రాముల వెండి, రూ. 4,270 నగదు, 5 ఐఫోన్లతో సహా 7 మొబైల్ ఫోన్లు, ఒక ఐప్యాడ్, ద్విచక్రవాహనం ఉన్నాయి.
ఈ ముఠాకు చెందిన ముగ్గురు సభ్యులను అరెస్ట్ చేసినట్లు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వెల్లడించారు. అరెస్టు చేసిన వారిలో బంగ్లాదేశ్లోని దినాజ్పూర్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ జౌని అలీ, మహమ్మద్ రుమాన్ అలీలతో పాటు మధ్యప్రదేశ్లోని భోపాల్కు చెందిన తరుణ్ సింగ్ ఉన్నారు. పోలీసుల ప్రాథమిక విచారణలో కీలక విషయాలు వెలుగుచూశాయి. అరెస్టయిన బంగ్లాదేశీయులు దేశంలో చోరీలు చేసేందుకు ప్రవేశించిన 12 మంది సభ్యుల బంగ్లాదేశ్ ముఠాలో భాగమని అధికారులు తెలిపారు. భోపాల్కు చెందిన తరుణ్ సింగ్, కొందరు స్థానిక ఏజెంట్ల సహాయంతో బంగ్లాదేశీయుల్లో ఒకరు నకిలీ వివరాలతో భారతీయ గుర్తింపు పత్రాలను పొందినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ ముఠాకు సహకరించిన వారు, అక్రమ నివాసానికి ఆశ్రయం ఇచ్చిన వారు, నకిలీ పత్రాలు తయారు చేసి ఇచ్చిన ఏజెంట్లందరిపై సమగ్ర విచారణ జరుపుతున్నామని ఉన్నతాధికారులు తెలిపారు.
ఇక ప్రధాన నిందితుడైన జౌని అలీకి 2015 నుంచే వివిధ నేరాలతో సంబంధం ఉందని, గతంలో ఒక చోరీ కేసులో శిక్ష కూడా అనుభవించాడని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. అతను గత కొన్నేళ్లలో కనీసం 12 సార్లు బంగ్లాదేశ్ సరిహద్దుల గుండా అక్రమంగా భారత్లోకి వచ్చి, నేరాలు చేసి తిరిగి తన దేశానికి వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. ఇటీవల మళ్లీ అక్రమంగా సరిహద్దులు దాటిన జౌని అలీ తన అనుచరులతో కలిసి మధ్యప్రదేశ్, మహారాష్ట్రల మీదుగా ప్రయాణించి ఆదిలాబాద్ చేరుకున్నాడు. జౌని అలీపై మొత్తం 8 కేసులు, తరుణ్పై 6 చోరీ కేసులు నమోదై ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.

