
కాళేశ్వరం ప్రాజెక్టులో చోటుచేసుకున్న లోపాలపై తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సరైన సాంకేతిక ప్రమాణాలు పాటించకపోవడం, తగిన సాయిల్ టెస్టింగ్ నిర్వహించకపోవడం వల్లే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు దెబ్బతిన్నాయని ఆరోపించారు.
ఆఫ్రి ఇండియా, ఐఐటీ బాంబే నిపుణుల సాంకేతిక నివేదికల్లో బ్యారేజీల పునాదుల్లో లోపాలు బయటపడ్డాయని, ప్రజల ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా శాస్త్రీయ నివేదికల ఆధారంగానే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని తెలిపారు. లీకేజీలు ఉన్న సమయంలో బ్యారేజీల్లో పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేయడం బాధ్యతారాహిత్యమని పేర్కొన్నారు.
కాళేశ్వరం అక్రమాలపై సీబీఐ విచారణ కోరుతూ కేంద్రానికి లేఖ రాసినా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని విమర్శించిన మంత్రి, కాళేశ్వరం కాంట్రాక్టర్ల నుంచి రూ.1,400 కోట్ల పార్టీ ఫండ్ తీసుకున్నట్లు బీఆర్ఎస్ నేతలే అంగీకరించారని ఆరోపించారు.
వచ్చే వేసవి నాటికి దెబ్బతిన్న రెండు బ్యారేజీల పునరుద్ధరణ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. అలాగే ఎస్ఎల్బీసీ టన్నెల్, దిండి, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులను కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పారు.
అదేవిధంగా, పర్యావరణ అనుమతులపై సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును స్వాగతించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, దీంతో తెలంగాణలో పెండింగ్లో ఉన్న పలు సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులు పొందే మార్గం సుగమమయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

