హరిద్వార్ కావడ్ మేళాలో భిక్షాటన ప్రయోగం.. 8 గంటల్లోనే ₹4,000 వసూలు!
హరిద్వార్లో జరిగిన కావడ్ మేళాలో ఓ యూట్యూబర్ చేసిన భిక్షాటన ప్రయోగం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కేవలం 8 గంటల పాటు భిక్షాటన చేయగా.. QR కోడ్ ద్వారా వచ్చిన మొత్తంతో కలిపి దాదాపు ₹4,000 సేకరించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
దీంతో భిక్షాటనను కొందరు ‘బిజినెస్’గా చూస్తున్నారా? లేక ఇదే ఓ కొత్త స్టార్టప్ ఐడియానా? అనే చర్చ మొదలైంది. అయితే ఈ ప్రయోగం ద్వారా వచ్చిన ఆదాయాన్ని మాత్రమే కాకుండా.. భిక్షాటన వెనుక ఉన్న పేదరికం, జీవన కష్టాలను కూడా అర్థం చేసుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

హరిద్వార్లో జరుగుతున్న ప్రసిద్ధ కావడ్ మేళాలో ఓ యూట్యూబర్ చేసిన భిక్షాటన ప్రయోగం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కేవలం 8 గంటల పాటు భిక్షాటన చేయగా సుమారు రూ.4,000 వరకు సేకరించినట్లు వీడియోలో చూపించారు. ఈ ప్రయోగం భిక్షాటన ద్వారా ఎంత ఆదాయం సమకూరుతుందనే అంశంతో పాటు, భిక్షాటనను వ్యాపారంగా చూడాలా అనే దానిపై కూడా సోషల్ మీడియాలో కొత్త చర్చకు దారితీసింది.
పురుషోత్తం వశిష్ట్ అనే యూట్యూబర్ తన స్నేహితుడు సచిన్తో కలిసి ఈ ప్రయోగం చేపట్టారు. ఒక్కరోజు భిక్షాటన చేస్తే ఎంత మొత్తం డబ్బు సమకూరుతుందో తెలుసుకోవడమే తమ ఉద్దేశమని తెలిపారు. ఇందులో భాగంగా సచిన్ ముఖానికి రంగు వేసుకుని మురికిగా కనిపించేలా తయారై, చిరిగిన దుస్తులు ధరించి భక్తుల మధ్య భిక్ష అడిగాడు. అంతేకాదు, మెడలో QR కోడ్ను ఉంచుకుని డిజిటల్ పేమెంట్స్ ద్వారా కూడా డబ్బు స్వీకరించాడు.
అయితే, ఈ ప్రయోగంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భిక్షాటన ద్వారా కనిపించే ఆదాయాన్ని మాత్రమే ఆధారంగా చేసుకుని, దాని వెనుక ఉన్న పేదరికం, అవమానాలు, అసురక్షిత పరిస్థితులు, రోజువారీ కష్టాలను అంచనా వేయడం సాధ్యం కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. కేవలం ఒక్కరోజు చేసిన ప్రయోగంతో భిక్షాటన జీవితంలోని వాస్తవ పరిస్థితులను పూర్తిగా అర్థం చేసుకోలేమని వారు పేర్కొంటున్నారు.

