కేరళలోని వయనాడ్ జిల్లాలో మరోసారి భారీ వర్షాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మెప్పాడి సమీపంలోని కల్లాడి ప్రాంతంలో పెద్ద ఎత్తున కొండచరియలు కూలిపోవడంతో పలువురు శిథిలాల కింద చిక్కుకుపోయి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన వయనాడ్ టన్నెల్ ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలో చోటుచేసుకున్నట్లు వార్తా సంస్థ పీటీఐ వెల్లడించింది.

మలప్పురం–వయనాడ్ జిల్లాలను అనుసంధానించే సొరంగ రహదారి నిర్మాణ పనులు జరుగుతున్న మీనాక్షి వంతెన సమీపంలో ఈ ప్రమాదం సంభవించినట్లు అగ్నిమాపక మరియు రెస్క్యూ సర్వీసు అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు అక్కడికి చేరుకుని రక్షణ చర్యలు ప్రారంభించాయి.

కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (KSDMA) ప్రకారం, జిల్లాలో కురుస్తున్న ఎడతెరిపి భారీ వర్షాలే కొండచరియలు విరిగిపడటానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ఈ ఘటనలో ఐదుగురు గాయపడగా, వారిని చికిత్స కోసం సమీప ఆసుపత్రులకు తరలించారు.

ఇదిలా ఉండగా, మీనంగాడిలో సిద్ధంగా ఉన్న ఎన్‌డిఆర్‌ఎఫ్ (NDRF) బృందం వెంటనే ప్రమాద స్థలానికి బయలుదేరిందని కేరళ ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. అలాగే కోజికోడ్‌లోని మరో ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాన్ని కూడా వయనాడ్‌కు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు.

పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, రక్షణ చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించింది. ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి తాజా పరిస్థితులపై వివరాలు తెలుసుకున్నట్లు సమాచారం.

I prefer this response