
విజయవాడలో డీఎస్సీ-2025 నియామకాల అంశం మరోసారి రాజకీయ దుమారం రేపింది. డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ సీబీఐతో విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. అయితే ఈ దీక్షా శిబిరానికి అధికారిక అనుమతి లేదని పేర్కొంటూ టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా తన అనుచరులతో అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ సందర్భంగా ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం నినాదాలు చేయడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. అనంతరం టీడీపీ కార్యకర్తలు దీక్షా శిబిరం టెంటును తొలగించే ప్రయత్నం చేయగా, దాన్ని వైసీపీ శ్రేణులు అడ్డుకోవడానికి ప్రయత్నించాయి. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను అదుపులోకి తీసుకుని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా విజయవాడలో భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.
మెగా డీఎస్సీ నియామకాలలో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తన పదవికి రాజీనామా చేయాలని వైసీపీ దీక్షలో పాల్గొన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సహా పలువురు నేతలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి మాట్లాడుతూ, “మెగా డీఎస్సీలో భారీ స్థాయిలో అక్రమాలు చోటుచేసుకున్నాయి. దీనిపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలి. ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో విఫలమైంది. స్పోర్ట్స్ కోటా కింద డీఎస్సీ ఉద్యోగాల కేటాయింపులో లక్షల రూపాయలు చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ ఉత్తర్వులను కూడా మార్చారని ఆరోపించారు. ఈ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి. శాంతియుతంగా చేపడుతున్న ప్రజాస్వామ్య పోరాటాలను పోలీసులు అడ్డుకోవడం సరికాదు. అణచివేత ధోరణి కొనసాగితే ప్రభుత్వం, అధికారులు దాని పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది” అని పేర్కొన్నారు.

