Matangi Anuradha Bonalu Bhavishyavani: బోనాల జాతరలో భాగంగా హైదరాబాద్ నగరంలోని ఉప్పుగూడ శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయంలో నిర్వహించిన రంగం కార్యక్రమంలో మాతంగి అనురాధ భవిష్యవాణి వినిపించారు. ఆచార సంప్రదాయాలను వీడితే అనర్థాలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు. తన పిల్లలను కాపాడుకుంటానని చెప్పారు.

Hyderabad Bonalu: ఉప్పుగూడలో ఘనంగా బోనాల ఉత్సవాలు
తెలంగాణలో బోనాల జాతర వైభవంగా కొనసాగుతోంది. అమ్మవారికి భక్తిశ్రద్ధలతో బోనాలు సమర్పిస్తూ భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ ఉప్పుగూడలోని శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.
ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన రంగం కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. మాతంగి అనురాధ పచ్చి కుండపై నిలబడి అమ్మవారి భవిష్యవాణిని వినిపించారు. ఈ సందర్భంగా సమాజంలో చోటుచేసుకుంటున్న పలు పరిణామాలపై ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు తమ ఆచారాలు, సంప్రదాయాలను నిర్లక్ష్యం చేయకుండా వాటిని గౌరవించాలని సూచించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.
ఆచారాలను వీడితే అనర్థాలే?
సమాజంలో పుణ్యం తగ్గిపోతూ పాపం పెరిగిపోతోందని మాతంగి అనురాధ హెచ్చరించారు. ప్రజలు తమ తప్పులను గుర్తించి సరిదిద్దుకోవాలని సూచించారు. తప్పులను సరిదిద్దుకోకుండా పాపాలు పెరిగితే ప్రకృతి వైపరీత్యాలు సంభవించే ప్రమాదం ఉందని, కుండపోత వర్షాలతో తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని భవిష్యవాణి వినిపించారు. తప్పులు దిద్దుకోకపోతే వర్షాలు, వరదల్లో మునిగిపోతారని హెచ్చరించారు.
ప్రజలు భక్తి మార్గంలో ఉన్నామని భావిస్తూ కొన్నిసార్లు మూఢనమ్మకాలను అనుసరిస్తున్నారని అన్నారు. అమ్మవారి పేరును అడ్డుపెట్టుకుని కొందరు చేస్తున్న అనుచిత చర్యల వల్ల తనకు చెడ్డపేరు వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజమైన భక్తి అంటే సంప్రదాయాలను గౌరవించడం, పెద్దల సూచనలను పాటించడం, ధర్మబద్ధమైన జీవనాన్ని సాగించడమేనని పేర్కొన్నారు.
తప్పులు చేసినా.. పిల్లలుగా భావించి కాపాడుతానంటూ..
తప్పులు చేసిన వారిని శిక్షిస్తానని, అయితే వారు ఎంతటి తప్పు చేసినా తన పిల్లలుగానే భావించి కాపాడుకుంటానని మాతంగి అనురాధ భవిష్యవాణిలో పేర్కొన్నారు. అమ్మవారిని భక్తిశ్రద్ధలతో కొలిచే భక్తులపై ఆమె కరుణ ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. భక్తులు అమ్మవారిని ఎంత భక్తితో, విశ్వాసంతో ఆరాధిస్తే అంతగా సంతోషిస్తానని.. నిజమైన మనసుతో కోరుకున్న కోరికలను నెరవేర్చి ప్రజలను చల్లగా చూస్తానని అన్నారు.
బోనాల జాతరలో నిర్వహించే రంగం కార్యక్రమం తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, భక్తి విశ్వాసాలకు ప్రతీకగా నిలుస్తోంది. అమ్మవారి భవిష్యవాణిని భక్తులు ఎంతో విశ్వాసంతో ఆలకిస్తూ.. తమ జీవితాల్లో ధర్మం, సంప్రదాయాలు, భక్తికి మరింత ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తున్నారు.

