
ఒకప్పుడు ప్రపంచ క్రికెట్ను శాసించిన వెస్టిండీస్ జట్టుకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. 2027 వన్డే ప్రపంచకప్కు నేరుగా అర్హత సాధించే అవకాశాన్ని వెస్టిండీస్ కోల్పోయింది. సెప్టెంబర్ 30 నాటికి ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో టాప్-8లో నిలిచే జట్లకు నేరుగా ప్రపంచకప్లో స్థానం దక్కనుంది. ఆతిథ్య దేశాలైన దక్షిణాఫ్రికా, జింబాబ్వేలను కలుపుకుని మొత్తం 10 జట్లు నేరుగా మెగా టోర్నీకి అర్హత సాధించనున్నాయి.
ఇటీవల ఐర్లాండ్తో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో అఫ్గానిస్థాన్ విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆ జట్టు వన్డే ర్యాంకింగ్స్లో టాప్-8లోకి దూసుకొచ్చింది. దీంతో ఆస్ట్రేలియా, భారత్, న్యూజిలాండ్, పాకిస్థాన్, శ్రీలంక, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్తో పాటు ఆతిథ్య జట్లు దక్షిణాఫ్రికా, జింబాబ్వే 2027 ప్రపంచకప్కు నేరుగా అర్హత సాధించాయి.
వెస్టిండీస్ ఇంకా భారత్తో రెండు వన్డేలు ఆడాల్సి ఉంది. అయితే ఆ రెండు మ్యాచ్ల్లో విజయం సాధించినప్పటికీ.. అఫ్గానిస్థాన్ను వెనక్కి నెట్టి టాప్-10లోకి ప్రవేశించే అవకాశం వెస్టిండీస్కు లేదని తెలుస్తోంది. దీంతో ఆ జట్టు ఇప్పుడు క్వాలిఫయర్ మార్గంలో ప్రపంచకప్ బెర్త్ కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
క్వాలిఫయర్ ద్వారానే అవకాశం..
2027 వన్డే ప్రపంచకప్లో చోటు సంపాదించాలంటే వెస్టిండీస్ ఐసీసీ వరల్డ్కప్ క్వాలిఫయర్ టోర్నీలో పాల్గొనాల్సి ఉంటుంది. ఈ టోర్నీలో ఐర్లాండ్తో పాటు క్రికెట్ వరల్డ్కప్ లీగ్-2లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన జట్లు, క్వాలిఫయర్ ప్లే ఆఫ్స్ నుంచి అర్హత సాధించిన జట్లు బరిలోకి దిగనున్నాయి.
క్వాలిఫయర్ టోర్నీలో విజేతగా నిలిచిన జట్టు నేరుగా ప్రపంచకప్లో స్థానం సంపాదిస్తుంది. ఒకవేళ వెస్టిండీస్ రెండో, మూడో లేదా నాలుగో స్థానాల్లో నిలిస్తే.. ‘సూపర్ సిరీస్’ ప్లేఆఫ్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఆ దశలో విజయం సాధించిన జట్టుకు ప్రపంచకప్లో మిగిలిన చివరి బెర్త్ లభిస్తుంది.
ఇక 2023 వన్డే ప్రపంచకప్ సమయంలోనూ వెస్టిండీస్ నేరుగా అర్హత సాధించలేక క్వాలిఫయర్స్ ఆడింది. అయితే ఆ టోర్నీలోనూ విఫలమైన విండీస్.. చరిత్రలో తొలిసారి ప్రపంచకప్కు దూరమైంది. ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా అర్హత పొందలేకపోయింది.
ఇప్పుడు 2027 ప్రపంచకప్ బెర్త్ కోసం మరోసారి క్వాలిఫయర్ టోర్నీపైనే ఆధారపడాల్సిన పరిస్థితి వెస్టిండీస్కు వచ్చింది. ఒకప్పుడు క్రికెట్లో తిరుగులేని శక్తిగా ఉన్న జట్టు.. వరుసగా మెగా టోర్నీలకు దూరమవుతుండటం అభిమానులను తీవ్రంగా నిరాశకు గురిచేస్తోంది.

