
ప్రభుత్వ ఉద్యోగం కావాలి. కానీ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవడానికి, సర్కారు బడుల్లో పిల్లలను చదివించడానికి వెనుకాడుతుంటారు. సౌలతులు ఉండవని, పాఠాలు సరిగా చెప్పరని.. ఇలా రకరకాల కారణాలు చెబుతుంటారు. ఈ పరిస్థితిని మార్చడానికి తెలంగాణ ప్రభుత్వం భారీ కసరత్తే చేస్తోంది. ఇప్పటికే తెలంగాణలోని సర్కారు దావఖానాల రూపురేఖలు మారాయి. ప్రభుత్వ హాస్పిటళ్లలోనే కార్పొరేట్కు దీటుగా ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు. అదే సమయంలో విద్యా రంగంలోనూ మంచి మార్పు దిశగా రేవంత్ రెడ్డి సర్కారు అడుగులేస్తోంది
తెలంగాణలోని 100 నియోజకవర్గాల్లో పబ్లిక్ స్కూళ్లు ఏర్పాటు కానున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఈ పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఈ మేరకు అధికారులను ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా, మంచాల మండలంలోని ఆరుట్ల గ్రామంలో ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రభుత్వ పాఠశాల తరహాలోనే కొత్త స్కూళ్లను ఏర్పాటు చేయనున్నారు. వాస్తవానికి ప్రతి మండలంలో కనీసం రెండు స్కూళ్లను పబ్లిక్ స్కూళ్లుగా మార్చాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందులో మొదటి అడుగుగా నియోజకవర్గానికి ఒకటి చొప్పున తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ఏర్పాటు చేయనున్నారు.

