
ప్రముఖ గార్మెంట్ మల్టీనేషనల్ కంపెనీని బెదిరించి అక్రమంగా డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించిన కేసులో 15 ఏళ్లుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటున్న 72 ఏళ్ల హరి సింగ్ షెకావత్ను ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ అధికారులు అరెస్ట్ చేశారు.
2016లోనే కోర్టు ఆయనను పరారీలో ఉన్న నేరస్థుడిగా ప్రకటించింది. అప్పటి నుంచి అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో తరచూ తన స్థావరాలను మార్చుకుంటూ పోలీసులకు చిక్కకుండా జీవించాడు. అయితే, తాజాగా అందిన పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన స్పెషల్ సెల్ అధికారులు జైపూర్లో హరి సింగ్ షెకావత్ను అదుపులోకి తీసుకున్నారు.
సుదీర్ఘకాలంగా పోలీసుల కళ్లుగప్పి తప్పించుకుంటున్న 72 ఏళ్ల వృద్ధ నేరస్థుడు ఎట్టకేలకు ఢిల్లీ పోలీసులకు చిక్కాడు. దాదాపు 15 ఏళ్ల క్రితం నమోదైన భారీ వసూళ్ల కేసులో ప్రమేయం ఉన్న హరి సింగ్ షెకావత్ అప్పటి నుంచి తన స్థావరాలను తరచూ మార్చుకుంటూ పోలీసులకు దొరకకుండా తప్పించుకుంటున్నాడు.
అయితే, ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ అధికారులకు అందిన పక్కా సమాచారంతో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి రాజస్థాన్లోని జైపూర్లో తలదాచుకున్న హరి సింగ్ షెకావత్ను వ్యూహాత్మకంగా అదుపులోకి తీసుకున్నారు. 15 ఏళ్లుగా పరారీలో ఉన్న నిందితుడిని అరెస్ట్ చేయడంతో కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
అసలేమిటీ బెదిరింపుల కేసు..?
2008లో ఓ ప్రముఖ అంతర్జాతీయ దుస్తుల తయారీ సంస్థలో పనిచేస్తున్న సమయంలో హరి సింగ్ షెకావత్పై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. సంస్థ యాజమాన్యం నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించడంతో పాటు, కంపెనీ ప్రతినిధులను బెదిరించి భయభ్రాంతులకు గురిచేశాడని ఆరోపించారు. ఈ వ్యవహారంపై 2008 మార్చి 15న పోలీసులు నేరపూరిత బెదిరింపులు, వసూళ్ల యత్నం కింద కేసు నమోదు చేశారు.
అయితే కేసు విచారణ ప్రారంభమైనప్పటి నుంచి షెకావత్ కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా వరుసగా విచారణకు గైర్హాజరవుతూ వచ్చాడు. న్యాయస్థానం జారీ చేసిన సమన్లను కూడా బేఖాతరు చేస్తూ తప్పించుకు తిరిగాడు. దీంతో చివరకు 2016 ఏప్రిల్ 2న న్యాయస్థానం అతడిని పరారీలో ఉన్న నేరస్థుడిగా ప్రకటించింది.
రాష్ట్రాలు మారుస్తూ పోలీసుల కళ్లుగప్పి..!
అరెస్టును, చట్టపరమైన చర్యలను తప్పించుకునేందుకు షెకావత్ తన ఆచూకీని పదేపదే మార్చుకున్నాడు. తొలుత ఢిల్లీ నుంచి గుజరాత్కు వెళ్లి అక్కడ కొంతకాలం తలదాచుకున్నాడు. అనంతరం తన గుర్తింపును దాచిపెట్టి రాజస్థాన్కు చేరుకున్నాడు.
సుదీర్ఘకాలంగా పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు ఢిల్లీ స్పెషల్ సెల్కు చెందిన సౌత్-వెస్ట్రన్ రేంజ్ బృందం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది. నెలకు పైగా కొనసాగిన మానవ నిఘా అనంతరం పోలీసులకు కీలక సమాచారం లభించింది. ఆగస్టు 13న షెకావత్ జైపూర్లోని ఓ నివాస సముదాయంలో దాక్కున్నట్లు పక్కా సమాచారం అందడంతో పోలీసులు అతడిని పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు.

