
ఏపీలో బాబా రాందేవ్ కంపెనీ పెట్టుబడులు పెడుతున్న సంగతి తెలిసిందే. విజయనగరం జిల్లాలో ఉన్న కొత్తవలస మండలం చినరావుపల్లిలో పతంజలి ఫుడ్ అండ్ హెర్బల్ పార్క్ ఏర్పాటు చేయనున్నారు. ఈ పెట్టుబడుల కోసం ఏపీ ప్రభుత్వం పతంజలి సంస్థకు ప్రోత్సాహకాలు కూడా అందిస్తోంది. దీనికి సంబంధించిన జీవోను తాజాగా విడుదల చేశారు. మూలధన పెట్టుబడి, కరెంట్ వినియోగం, ఎస్జీఎస్టీలలో రాయితీలు అందిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో ప్రతిష్టాత్మక సంస్థ పెట్టుబడులు పెడుతోంది. బాబా రాందేవ్కు చెందిన పతంజలి గ్రూపు ఏపీలో పెట్టుబడులు పెడుతోంది. విజయనగరం జిల్లాలో రూ.370.10 కోట్లతో ఫుడ్ అండ్ హెర్బల్ పార్కును పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సదరు కంపెనీ నుంచి ఏపీ ప్రభుత్వానికి చేరగా.. ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తాజాగా భారీగా ప్రోత్సాహకాలను సైతం ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలోని చినరావుపల్లిలో పతంజలి ఫుడ్ అండ్ హెర్బల్ పార్కు ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం ఏపీ కేబినెట్ ఇప్పటికే ఆమోదం తెలిపింది.
తాజాగా పతంజలి సంస్థకు భారీ ప్రోత్సాహకాలు మంజూరు చేస్తూ ఏపీ పరిశ్రమలు, వాణిజ్యశాఖ జీవో కూడా జారీ చేసింది. ఈ జీవో ప్రకారం పతంజలి గ్రూప్ స్థిర మూలధన పెట్టుబడిపై 25 శాతం రాయితీ కింద రూ.60.65 కోట్ల వరకూ గరిష్టంగా మాఫీ చేస్తారు. అలాగే యూనిట్ కరెంట్కు రూపాయి చొప్పున ఐదేళ్ల పాటు రూ.3.25 కోట్ల వరకూ కరెంట్ ఛార్జీ రీయింబర్స్మెంట్ సౌకర్యం కల్పించారు. ఎస్జీఎస్టీలో వందశాతం రీయింబర్స్మెంట్ లేదా ఐదేళ్ల దాకా రూ.40 కోట్ల వరకూ ప్రయోజనం ఇవ్వనున్నారు. పతంజలి ఫుడ్ అండ్ హెర్బల్ పార్కు ఏర్పాటుకు కావాల్సిన అన్ని అనుమతులను అధికారులు నిర్ణీత గడువులోగా ఇవ్వాలని జీవోలో పేర్కొన్నారు.

