
సింహాచలం అప్పన్న ఆలయం గిరి ప్రదక్షిణపై కలెక్టర్ కీలక సమీక్ష నిర్వహించారు. ఈ నెల 28, 29 తేదీల్లో గిరి ప్రదక్షిణ నిర్వహిస్తామని.. భక్తుల కోసం విస్తృత ఏర్పాట్లు చేయాలని అధికారుల్ని కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ ఆదేశించారు. రెండు రోజుల పాటూ నిర్వహించే గిరి ప్రదక్షిణకు సంబంధించిన చేయాల్సిన ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష చేశారు. తాగునీరు, రెస్ట్ రూమ్లు, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు.
విశాఖపట్నం సింహాచలం శ్రీ వరాహలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గిరి ప్రదిక్షణకు ముహూర్తం ఖాయమైంది. జులై 28, 29 తేదీల్లో గిరి ప్రదక్షిణ నిర్వహించనున్నట్లు కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ తెలిపారు. గిరి ప్రదక్షిణ ఏర్పాట్లపై కలెక్టర్ అధికారులతో చర్చించారు. ఈ ఏడాది గిరి ప్రదక్షిణకు లక్షలాదిమంది భక్తులు తరలివస్తారని.. అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ నెల 28న సింహాచలం ఆలయ అనువంశిక ధర్మకర్త తొలిపావంచా దగ్గర పూజలు నిర్వహిస్తారని.. ఆ తర్వాత గిరి ప్రదక్షిణ మొదలవుతుందని కలెక్టర్ తెలిపారు. గిరి ప్రదక్షిణ కోసం వచ్చే భక్తులకు అవసరమైన మౌలిక వసతులపై దృష్టిపెట్టాలన్నారు.
గిరి ప్రదక్షిణ సమయంలో పరిస్థితుల్ని పర్యవేక్షించేందుకు వీలుగా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని సూచించారు కలెక్టర్. భక్తులు తొలిపావంచా దగ్గర కొబ్బరికాయ కొట్టేందుకు 50 క్యూలైన్లు, 100 ఐరన్ స్టాండ్లు ఏర్పాటు చేయాలన్నారు. భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైతే అదనంగా కౌంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. సింహాచలంలో 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ మార్గంలో భక్తులకు అవసరమైన తాగు నీరు, లైట్లు, బయో టాయిలెట్లు, మెడికల్ క్యాంప్లు, అంబులెన్స్లు, భక్తులు విశ్రాంతి తీసుకునేలా ప్రతి ఐదు కిలోమీటర్లకు ఒక రెస్ట్ రూమ్ ఏర్పాటు చేయాలన్నారు. గిరి ప్రదక్షిణ కోసం భక్తులు భారీగా తరలివస్తారు కాబట్టి వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు.

