
సుదీర్ఘ వేసవి సెలవుల అనంతరం ఇటీవల దేశ వ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలు మళ్లీ తెరచుకున్నాయి. కొత్త పుస్తకాలు, బ్యాగులు, యూనీఫాంలతో విద్యార్ధులు ఎంతో హుషారుగా బడులకు వెళ్తున్నారు. ఈ క్రమంలో మరోమారు బడులకు వరుస సెలవులు రానున్నాయి. ఏకంగా రెండు వారాల పాటు సెలవులు రానున్నాయి.
వానాకాలం వచ్చినా బాణుడు ఇంకా భగభగలాడుతూనే ఉన్నాడు. గరిష్ట ఉష్ణోగ్రతల నేపథ్యంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు జూలై 6 నుంచి జూలై 19 వరకు రెండు వారాల పాటు వేసవి సెలవులను రానున్నాయి. ఈ మేరకు కాశ్మీర్ లోయ వ్యాప్తంగా ఉన్నత మాధ్యమిక స్థాయి వరకు ఉన్న విద్యా సంస్థలకు ఇస్తున్నట్లు అక్కడి కాశ్మీర్ విద్యా డైరెక్టరేట్ (DSEK) ప్రకటించింది.
వేసవి సెలవుల అనంతరం మళ్లీ జూలై 20న పాఠశాలలు తిరిగి తెరుచుకుంటాయి. అదే రోజు నుంచి యధావిధి తరగతులు తిరిగి ప్రారంభమవుతాయని విద్యాశాఖ తన ప్రకటనలో పేర్కొంది. వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో గరిష్ఠ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇందులో భాగంగా గత కొన్ని రోజులుగా కాశ్మీర్ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పరిమితికి మించి పెరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో నెలకొన్న వాతావరణ పరిస్థితుల కారణంగా తల్లిదండ్రులు, విద్యార్థులు వేసవి సెలవులు ప్రకటించాలని డిమాండ్ చేస్తుండటంతో అక్కడి ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. జమ్మూ కాశ్మీర్ విద్యాశాఖ మంత్రి సకీనా ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. సెలవుల సమయంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది సురక్షితంగా ఉండాలని కోరారు. విద్యార్థులు తగినన్ని నీళ్లు తాగాలని, ఎండ వేడిమి నుండి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, ఈ సమయాన్ని విశ్రాంతి, చదువు, కుటుంబంతో జరుపుకునే కార్యక్రమాల కోసం ఉపయోగించుకోవాలని ఆమె ప్రోత్సహించారు.

