ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) హబ్గా తీర్చిదిద్దే దిశగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఓపెన్‌ఏఐటాటా గ్రూప్ భాగస్వామ్యంలో భారత్‌లో అత్యాధునిక ఏఐ డేటా సెంటర్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అనకాపల్లి జిల్లా (విశాఖపట్నం సమీపంలో) టీసీఎస్‌కు 200 ఎకరాల భూమిని కేటాయించినట్లు సమాచారం.

ఇప్పటికే అదే ప్రాంతంలో గూగుల్ తన మెగా హైపర్‌స్కేల్ డేటా సెంటర్‌ను నిర్మిస్తోంది. ఇప్పుడు టీసీఎస్-ఓపెన్‌ఏఐ ప్రాజెక్ట్ కూడా అందులో చేరితే విశాఖ–అనకాపల్లి ప్రాంతం దేశంలోని కీలక ఏఐ, డేటా సెంటర్ హబ్‌గా రూపుదిద్దుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ ప్రాజెక్ట్ ద్వారా ఏఐ కంప్యూటింగ్, క్లౌడ్ సేవలు, డేటా స్టోరేజ్ వంటి అత్యాధునిక మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయడంతో పాటు ప్రభుత్వం, బ్యాంకింగ్, టెలికాం, హెల్త్‌కేర్ వంటి రంగాలకు అవసరమైన ఏఐ సేవలను దేశీయంగా అందించడమే లక్ష్యంగా టాటా గ్రూప్ ముందుకు సాగుతోంది. దీంతో ఆంధ్రప్రదేశ్ ఐటీ రంగానికి కొత్త ఊపు లభించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.