
భారతీయులు, హిందువుల మనోభవాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేస్తున్న వారిని గొడ్డలి పార్టీ సమర్థించడం భారత రాజ్యాంగానికి తూట్లు పొడవడమేనని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి (AP Minister Anam Ram Narayana Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కించపరుస్తూ రాజ్యాంగానికి పెడర్థాలు తీసి ప్రజల మనోభవాలను దెబ్బతీస్తున్నారని ధ్వజమెత్తారు.
సమాజాన్ని తమవైపు తిప్పుకోవడానికి మత విద్వేషాలు రెచ్చగొడతారా? అని మంత్రి ఆనం ప్రశ్నించారు. ఒక వ్యక్తి రావణ్ పేరుతో హిందువుల మనోభవాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ పీఠాధిపతులను కూడా విమర్శించే స్థాయికి జగన్ అండ్ కో వెళ్లిపోయారని మండిపడ్డారు. ఇలాంటి వాటిని ప్రోత్సహించాలని రాజారెడ్డి రాజ్యాంగంలో రాసుకున్నారా? అని ప్రశ్నించారు. సామాన్యుల మనుగడను దెబ్బతీసే ప్రయత్నాన్ని ప్రోత్సహిస్తున్న జగన్ రెడ్డి వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆర్టికల్ 19(1ఏ) భావస్వేచ్ఛను ప్రతి ఒక్కరికీ కల్పించినట్లే.
మత విశ్వాసాలను, స్వేచ్ఛను పరిరక్షించే హక్కులను రాజ్యాంగం కల్పించిందని మంత్రి ఆనం తెలిపారు. రాజ్యాంగం ఇవ్వని భావ ప్రకటన స్వేచ్ఛ తమకుందని చెప్పుకుంటూ అనేక వర్గాలను, మతాలను వేరు చేయాలని జోసఫ్ రావణ్ అనే వ్యక్తి ద్వారా జగనే చేయిస్తున్నారని ఆరోపించారు. మతాలను అగౌరవపరచమని ఏ రాజ్యాంగం చెప్పిందో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలాంటి వారిపై చట్టాలు తన పని తాను చేసుకోవాల్సి ఉందని మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి పేర్కొన్నారు.

