
పొగాకు సాగు అనగానే రాష్ట్రంలో ముందుగా గుర్తొచ్చేది ప్రకాశం జిల్లానే. టంగుటూరు, కందుకూరు వేలం కేంద్రాలతో పాటు మార్కాపురం జిల్లాలోని పొదిలి, కనిగిరి వేలం కేంద్రాల్లో ఈ పొగాకు బేళ్లను రైతులు విక్రయిస్తుంటారు. అయితే, బ్రైట్ రకం పొగాకుకు కూడా సరైన రేటు ఇవ్వడం లేదంటూ రైతులు ఆందోళన చేస్తున్నారు. రూ. 20 వేల నుంచి రూ. 24 వేల వరకు పలికే రకానికి రూ. 16 వేలు మాత్రమే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పొగాకు పంట విస్తారంగా సాగు చేస్తారు. ఈ ప్రాంతంలో పండే పొగాకుకు ప్రపంచ మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. అందుకే, రైతులు కూడా పోటీపడి మరీ పంట సాగు చేస్తుంటారు. ఈ ఏడాది అనుకున్న స్థాయి కంటే మంచి పంట చేతికొచ్చింది. బ్యార్నీల్లో కూడా మంచి రేటు ఉన్న పొగాకునే రైతులు దిగుబడి చేశారు. అంతా బాగనే ఉన్నా వేలం కేంద్రాల్లో మాత్రం కొనేవాళ్లు లేక రైతులు కన్నీళ్లు పెడుతున్నారు.
టంగుటూరు, కందుకూరుతో పాటు మార్కాపురం జిల్లాలోని పొదిలి, కనిగిరి ప్రాంతాల్లో పొగాకు వేలం కేంద్రాలు ఉన్నాయి. చుట్టుపక్కల రైతులు తాము పండించిన పంటను ఈ వేలం కేంద్రాల్లోనే విక్రయిస్తుంటారు. అయితే, ఈ ఏడాది పొగాకు వేలం ప్రారంభమైనప్పటి నుంచి వేలం అధికారులు – రైతుల మధ్య సయోధ్య కుదరడం లేదు. పొగాకు బాగున్నప్పటికీ దానికి తగ్గ రేటు ఇవ్వడం లేదని రైతులు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు.
తాజాగా కందుకూరులోని రెండో పొగాకు వేలం కేంద్రంలో ధరలు రావడం లేదంటూ రైతులు వేలాన్ని అడ్డుకున్నారు. లింగసముద్రం మండలంలోని తిమ్మారెడ్డిపాలెం క్లస్టర్కు చెందిన రైతులు పొగాకు బేళ్లను వేలం కేంద్రానికి తీసుకొచ్చి.. గిట్టుబాటు ధరలు ఇవ్వడం లేదంటూ వేలాన్ని ఆపేయాలని డిమాండ్ చేశారు. దాంతో అధికారులు వేలాన్ని పూర్తిగా నిలిపివేశారు.

