
హైదరాబాద్ నగరంలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీల వినియోగం పెరుగుతుండటంతో క్లౌడ్ కిచెన్లు భారీగా పుట్టుకొస్తున్నాయి. ఈ క్లౌడ్ కిచెన్లలో నాణ్యతలేని ఆహారం తయారు చేస్తున్నారన్న ఫిర్యాదులతో ఫుడ్ సేఫ్టీ అధికారులు, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తనిఖీలు చేపట్టాయి. కుళ్లిన పదార్థాలు, ఎలుకలు, ఈగల మలంతో కూడిన ఆహారాన్ని గుర్తించి రెండు కిచెన్ల లైసెన్సులు రద్దు చేశారు. నెగటివ్ రివ్యూలు తొలగించడం, ట్రేడ్ లైసెన్స్ లేని అవుట్లెట్లను అనుమతించడంపై స్విగ్గీ, జొమాటోలకు నోటీసులు జారీ చేసి వారం రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
హైదరాబాద్ నగరంలో రోజురోజుకూ ఆన్లైన్ ఫుడ్ డెలివరీలు విపరీతంగా పెరుగుతుండటంతో, దానికి అనుగుణంగా క్లౌడ్ కిచెన్ లు భారీగా వెలుస్తున్నాయి. స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్లలో ఆర్డర్లు ఇచ్చి ఆహారాన్ని తెప్పించుకునే కస్టమర్ల సంఖ్య పెరగడాన్ని కొందరు నిర్వాహకులు వ్యాపార అవకాశంగా మార్చుకుంటున్నారు. క్లౌడ్ కిచెన్ అంటే కేవలం ఆహారాన్ని వండటానికి, డెలివరీ చేయడానికి మాత్రమే పరిమితమైన ఒక చిన్న వంటగది. ఇక్కడ కస్టమర్లు కూర్చుని తినడానికి టేబుళ్లు, కుర్చీలు, వెయిటర్లు, ఖరీదైన ప్రైమ్ లొకేషన్లతో పనిలేదు. చాలా తక్కువ పెట్టుబడితో ఒకే వంటగది నుంచి వేర్వేరు బ్రాండ్ పేర్లతో బిర్యానీ, పిజ్జా, చైనీస్ వంటకాలను ఆన్లైన్లో విక్రయించవచ్చు.
అయితే.. ఈ పెట్టుబడి సౌలభ్యాన్ని ఆసరాగా చేసుకుని చాలామంది నిర్వాహకులు కనీస పరిశుభ్రత, ఆహార భద్రతా ప్రమాణాలను గాలికి వదిలేస్తున్నారు. తక్కువ ధరకే ఆహారం అందిస్తున్నామంటూ ఫుడ్ డెలివరీ యాప్లలో బంపర్ ఆఫర్లు, డిస్కౌంట్లు ఇస్తుండటంతో కస్టమర్లు ఎగబడి ఆర్డర్లు చేస్తున్నారు. కానీ, ఆ ఆహారం ఎక్కడ, ఎలాంటి పరిస్థితుల్లో తయారవుతుందో తెలుసుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో కస్టమర్ల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఫుడ్ సేఫ్టీ అధికారులు, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మూడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని పలు క్లౌడ్ కిచెన్లపై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో దిగ్భ్రాంతికర నిజాలు వెలుగులోకి వచ్చాయి.
చాలా కిచెన్లలో ఎక్స్పైరీ అయిన ఆహార పదార్థాలు వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. పచ్చి మాంసం, చికెన్, మటన్లను సరైన ఉష్ణోగ్రతలో నిల్వ చేయకపోవడం, లేబులింగ్ లేని మసాలాలు వాడటం, దుర్గంధం వెదజల్లే అపరిశుభ్రమైన ఫ్రిజ్లు, సిబ్బంది చేతులు కడుక్కునే సదుపాయం కూడా లేకపోవడం వంటి అనేక లోపాలు బయటపడ్డాయి. మరికొన్ని కిచెన్లలో ఆహార పదార్థాలు నిల్వ ఉంచే చోట పిల్లులు, ఎలుకలు తిరుగుతుండగా.. ఈగలు, బొద్దింకలు సంచరిస్తున్నాయి. కొన్ని రకాల ఫుడ్ ఐటమ్స్లో బొద్దింకల మలం కూడా కలవడం అధికారులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ తీవ్ర ఉల్లంఘనలపై తక్షణమే స్పందించి రెండు క్లౌడ్ కిచెన్ల లైసెన్సులను అధికారులు రద్దు చేశారు.

