
తెలంగాణ శాసనసభలో ప్రభుత్వ తరఫున కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న ముగ్గురు కాంగ్రెస్ శాసనసభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం సముచిత ప్రాధాన్యతను ఇచ్చింది. సీనియర్ ఎమ్మెల్యేలు చింతకుంట విజయ రమణారావు, యెన్నం శ్రీనివాస్ రెడ్డి మరియు వేముల వీరేశంలకు ప్రభుత్వ విప్లుగా బాధ్యతలు అప్పగించడంతో పాటు వారికి రాష్ట్ర మంత్రి హోదాను కల్పిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. శాసనసభా వ్యవహారాల్లోనూ, ప్రజా సమస్యల పరిష్కారంలోనూ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న ఈ ముగ్గురు ప్రజాప్రతినిధుల సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ రాష్ట్రంలో శాసనసభా వ్యవహారాల నిర్వహణను మరింత వేగవంతం చేసే దిశగా ప్రభుత్వం ముందడుగు వేసింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు ప్రముఖ ఎమ్మెల్యేలను ప్రభుత్వ విప్లుగా నియమించింది. అందులో చింతకుంట విజయ రమణారావు, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, వేముల వీరేశంలు ఉండగా.. వీరి అభిమానులు, అనుచరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేవలం విప్ పదవులకు మాత్రమే వీరిని పరిమితం చేయకుండా.. వీరందరికీ రాష్ట్ర మంత్రి హోదాను కల్పిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ పూర్తి వివరాలు మీకోసం.
ప్రభుత్వం ఇచ్చిన తాజా ఉత్తర్వుల ప్రకారం.. ఈ ముగ్గురు నాయకులకు ‘స్టేట్ వారెంట్ ఆఫ్ ప్రిసిడెన్స్’లోని ఆర్టికల్–18 ప్రకారం రాష్ట్ర మంత్రి హోదాకు వర్తించే అధికారిక మర్యాదలు, ప్రోటోకాల్ సౌకర్యాలు లభిస్తాయి. మార్చి 18వ తేదీ నాటి నుంచే వీరు ప్రభుత్వ విప్లుగా బాధ్యతలు స్వీకరించినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. అయితే వీరికి కల్పించిన ఈ రాష్ట్ర మంత్రి హోదా, సంబంధిత ప్రోటోకాల్ అధికారాలు వారు ప్రభుత్వ విప్లుగా పదవిలో ఉన్న కాలానికి మాత్రమే వ్యక్తిగతంగా వర్తిస్తాయని ప్రభుత్వం ఆ జీవోలో స్పష్టం చేసింది.

