
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం శరవేగంగా సాగుతోందని ఏపీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ (AP Minister Gottipati Ravikumar) వ్యాఖ్యానించారు. ఈరోజు (గురువారం) అమరావతి వేదికగా మీడియాతో మంత్రి గొట్టిపాటి మాట్లాడారు. రాజధాని ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధికి రైతుల త్యాగమే కారణమని పేర్కొన్నారు.
భూములు ఇచ్చిన రైతుల త్యాగాలతోనే అమరావతి నిర్మాణం ఇంత పెద్దఎత్తున జరుగుతోందని వెల్లడించారు. జగన్ హయాంలో అసెంబ్లీలో 30 వేల ఎకరాలకు తక్కువ కాకుండా రాజధాని ఉండాలని మద్దతు ఇచ్చారని తెలిపారు. ఆ ఆ తర్వాత మూడు రాజధానుల పేరుతో ప్రజల్లో అయోమయం సృష్టించారని ఆగ్రహించారు. ఈ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధిని జగన్ వచ్చి చూడాలని హితవు పలికారు.
ఎడ్యుకేషన్ హబ్గా అమరావతి మారుతుందని చెప్పుకొచ్చారు. SRM, VIT, BITS పిలానీ వంటి ప్రముఖ విద్యాసంస్థలు ఇక్కడకు వస్తున్నాయని వెల్లడించారు. త్వరలోనే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్శిటీ, కళాశాల కూడా రాబోతున్నాయని చెప్పుకొచ్చారు. రైల్వేస్టేషన్, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, టెక్, సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిన నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు.

