
వర్షాలు కురవడం ప్రారంభమవడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో డెంగ్యూ, మలేరియా కేసుల ముప్పు పెరిగింది. చాలా మంది ఈ రెండు జ్వరాలతో బాధపడతూ ఆస్పత్రుల్లో జాయిన్ అయ్యారు. అయితే, డెంగ్యూ, మలేరియా ఒకేసారి రావడం సాధ్యమేనా? వస్తే ఏమవుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలాంటి అనుమానాలకు ఫుల్ క్లారిటీ ఇచ్చారు డాక్టర్ కె. శేషి కిరణ్
వర్షాకాలం మొదలైంది. వర్షాకాలంలో దోమల బెడద పెరుగుతుంది. దోమ కాటు వల్ల ఈ సీజన్లో డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరం వంటి ముప్పు పెరుగుతుంది. అయితే, చాలా మందికి ఓ డౌట్ ఉంది. డెంగ్యూ, మలేరియా ఒకేసారి రావడం సాధ్యమేనా? దీని సమాధానం అవును అంటున్నారు డాక్టర్ కె. శేషి కిరణ్ (సీనియర్ కన్సల్టెంట్ జనరల్ ఫిజీషియన్, యశోద హాస్పిటల్స్, హైదరాబాద్.) ఒకే సమయంలో రెండూ రావడం సాధ్యమే అంటున్నారు.
వర్షాకాలంలో వ్యాధులు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి సమయంలో ఒకే వ్యక్తి డెంగ్యూ, మలేరియా రెండింటి బారిన పడే అవకాశం ఉంది. రెండు వ్యాధులు ఒకే ప్రాంతంలో ఎక్కువగా ఉన్నప్పుడు ప్రజలు ఈ ప్రమాదానికి గురవుతుంటారు. ఇవి వేర్వేరు దోమల ద్వారా వ్యాపిస్తాయి. డెంగ్యూ “ఎడీస్” (Aedes) దోమల ద్వారా, మలేరియా “అనాఫిలిస్” (Anopheles) దోమల ద్వారా వ్యాపిస్తాయి. ఒకే వ్యక్తికి రెండు ఇన్ఫెక్షన్లు రావడం అరుదే అయినప్పటికీ, ఇది చాలా కీలకమైన పరిస్థితి. సకాలంలో గుర్తించకపోతే వ్యాధి ముదిరి ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. దీని గురించి మరింత సమాచారం అందిందారు డాక్టర్ కె. శేషి కిరణ్.
మలేరియాలో జ్వరం సాధారణంగా ఒక వ్యవధిలో (విడతలవారీగా) వస్తూ, చలి, చెమటలు పడటం ఎక్కువగా ఉంటుంది. కానీ డెంగ్యూలో ఒళ్లు నొప్పులు చాలా తీవ్రంగా ఉంటాయి, చర్మంపై ఎర్రటి మచ్చలు రావచ్చు. ప్లేట్లెట్ల సంఖ్య వేగంగా తగ్గుతుంది. అయితే ఈ లక్షణాలు ఒకదానికొకటి కలిసిపోయే అవకాశం ఉన్నందున, సరైన నిర్ధారణకు ల్యాబ్ పరీక్షలు తప్పనిసరి. ఈ రెండు వ్యాధులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో వైద్యులు అనుమానం వస్తే రెండింటికీ పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తారు.

