
సూపర్ ఎల్నినో సమయంలో ప్రతి నీటి బొట్టు ఎంతో విలువైనదని కాలువల్లో పూడిక తీయడం, గట్లు లీకేజీలు లేకుండా మరమ్మతులు చేయడం వంటి చర్యల ద్వారా నీటి వృథాను అరికట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సూచించారు. సూపర్ ఎల్నినో కారణంగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గురువారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్తో సమావేశమై చర్చించారు.
రాష్ట్రంలో నెలకొన్న సాగునీటి సంక్షోభంపై రైతుల్లో అవగాహన కల్పించాలని, ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టిసారించాలని పవన్ కల్యాణ్ సూచించారు. పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట తదితర నియోజకవర్గాల రైతుల కోసం ఏలేరు ప్రాజెక్టు నుంచి వెయ్యి క్యూసెక్కుల నీటిని విడుదల చేయించినందుకు మంత్రికి పవన్ కృతజ్ఞతలు తెలిపారు.
నీటి కొరత పరిస్థితులను పరిశీలించేందుకు ఏలేరు ఆయకట్టు ప్రాంతాల్లో పర్యటనకు వెళ్తున్నట్టు మంత్రి నిమ్మల తెలిపారు. సాగునీటి ఎద్దడిపై రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, వారికి అవగాహన కల్పించాల్సిన బాధ్యతను అధికారులతోపాటు ప్రజాప్రతినిధులు కూడా తీసుకుంటే ఫలితం ఉంటుందన్నారు. కాగా, శస్త్రచికిత్స చేయించుకున్న పవన్ ఆరోగ్య పరిస్థితిపై మంత్రి నిమ్మల ఆరా తీశారు. త్వరితగతిన కోలుకుని, తిరిగి ప్రజాసేవలో మరింత చురుగ్గా పాల్గొనాలని ఆకాంక్షించారు.

