
బీఆర్ఎస్ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అకాల మరణం పట్ల మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన మృతితో నమ్మకమైన ఉద్యమ సహచరుడిని, ఆప్తమిత్రుడిని కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ది కుటుంబ సభ్యులకు, అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
తెలంగాణ ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి పోషించిన పాత్రను కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. ఉద్యమం నుంచి చివరి శ్వాస వరకు పార్టీ కోసం అంకితభావంతో పనిచేశారని, నర్సంపేట అభివృద్ధికి విశేష కృషి చేశారని కొనియాడారు.
ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పెద్ది మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, తెలంగాణ ఉద్యమంలో ఆయన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు సైతం సంతాపం వ్యక్తం చేసి, పెద్ది కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

