
ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేస్తే ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిలిచిపోతాయన్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని తెలంగాణ హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. క్యూర్ ప్రాంతాల్లో నిర్మించే ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వం రూ.5 లక్షల సబ్సిడీ అందించనుండగా.. తొలి దశలో 17 నియోజకవర్గాల్లో 7,680 ఫ్లాట్లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై తెలంగాణ హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ వీపీ గౌతమ్ కీలక స్పష్టత ఇచ్చారు. ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం నుంచి వచ్చే ఇతర సంక్షేమ పథకాల ప్రయోజనాలు నిలిచిపోతాయని జరుగుతున్న ప్రచారంపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు వదంతులను నమ్మకుండా అధికారిక సమాచారాన్నే విశ్వసించాలని కోరారు. ఈ మేరకు తెలంగాణ హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ వీపీ గౌతమ్ ఒక వీడియోను విడుదల చేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం నిరుపేదలకు సొంతింటి కలను సాకారం చేయడమేనని ఆయన చెప్పారు. ముఖ్యంగా కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్) పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసినా.. ఇప్పటికే పొందుతున్న ఇతర సంక్షేమ పథకాలపై ఎలాంటి ప్రభావం ఉండదని తేల్చి చెప్పారు. పింఛన్లు, రేషన్, ఇతర ప్రభుత్వ పథకాలు నిలిపివేస్తారనే ప్రచారం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు.

