
ఆంధ్రప్రదేశ్కు చెందిన భక్తుడు గురుపౌర్ణమి సందర్భంగా షిర్డీ సాయికి ఖరీదైన కానుకను గురు దక్షిణగా అందజేశారు. ఏలూరుకు చెందిన భక్తుడు రూ.1.3 కోట్ల విలువ చేసే 629 గ్రాముల బంగారు కిరీటాన్ని బాబాకు అందజేశారు. ఆయనతో పాటుగా మరో ఇద్దరు భక్తులు కూడా బాబాకు ఖరీదైన కానుకల్ని సమర్పించారు. ఇటు ఎన్టీఆర్ జిల్లాలోని ఆలయంలో బాబాకు రూ.కోటి 70 లక్షలతో కిరీటాన్ని సమర్పించారు.
గురు పౌర్ణమి వేళ ఆంధ్రప్రదేశ్కు చెందిన భక్తుడు షిర్డీ సాయిబాబాపై భక్తిని చాటుకున్నారు. బాబాను గురువుగా భావించి దురుదక్షిణగా ఖరీదైన కానుకను సమర్పించారు. ఏలూరుకు చెందిన శ్రీనివాసరావు సాయిబాబాకు రూ.1.3 కోట్ల విలువ చేసే 629 గ్రాముల బంగారు కిరీటాన్ని గురుదక్షిణగా అందజేశారు. గురు పౌర్ణమి వేళ సాయిబాబాకు గురుదక్షిణగా కిరీటాన్ని అందజేయడం ఆనందంగా ఉందన్నారు శ్రీనివాసరావు. ఈ సమస్తం సాయినాథుడే కాబట్టి బంగారు కిరీటాన్ని అందించామని.. బాబాకి హారతి సమయాల్లో అలంకరించాలని షిర్డీ సంస్థాన్ వారిని కోరారు. ఈ కిరీటం చుట్టూ నవగ్రహాలు, నవరత్నాలు, అమెరికన్ సీజెడ్ డైమండ్స్తో తయారు చేశారన్నారు.
శ్రీనివాసరావుతో పాటుగా జబల్పూర్కు చెందిన రిటైర్డ్ ఆర్మీ జవాన్ ఓంప్రకాష్ శర్మ రూ.8 లక్షల విలువైన 60 గ్రాముల బంగారు కిరీటాన్ని అందజేశారు. అలాగే బరోడాకు చెందిన విజయ్ నాయక్ రూ.9 లక్షల విలువైన 51 గ్రాముల రెండు బంగారు ఓం అక్షరాలను అందించారు. షిర్డీలో మూడు రోజుల పాటూ గురు పౌర్ణమి వేడుకలు నిర్వహించారు. దేశ, విదేశాల నుంచి వచ్చిన లక్షలాదిమంది భక్తులు సాయిబాబాను దర్శించుకున్నారు. కొంతమంది భక్తులు గురు పౌర్ణమి వేళ సాయిబాబాను వారి గురువుగా భావిస్తారు. భక్తులకు తోచిన విధంగా కానుకల్ని గురుదక్షిణగా సమర్పిస్తుంటారు.

