
హీరోయిన్ త్రిషను ఉద్దేశించి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఉదయనిధి కామెంట్స్ పై నటి ఖుష్బూ సుందర్ తీవ్రంగా స్పందించారు. రాజకీయ లబ్ధి కోసం మహిళల గౌరవాన్ని బలి చేయడం సరికాదని మండిపడ్డారు. ఉదయనిధి వ్యాఖ్యలు ఆయన రాజకీయ సంస్కృతినే ప్రతిబింబిస్తున్నాయని, ఈ విషయంలో ఆయన త్రిషకు బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
ఇలాంటి భాషను సమర్థించేవారు ఒక విషయం గుర్తుంచుకోవాలి. మహిళల గౌరవాన్ని రాజకీయాల కోసం బలి చేస్తే, చివరికి ఏ కుటుంబమూ (మీ కుటుంబంతో సహా) అలాంటి అవమానాల నుంచి తప్పించుకోదు. రాజకీయ భేదాలతో సంబంధం లేకుండా, ప్రజా వేదికలపై మాట్లాడేటప్పుడు హద్దుల్లో ఉండాలి. మహిళలను ఎల్లప్పుడూ గౌరవించాలి, అంతేగానీ రాజకీయ ప్రయోజనాల కోసం పావులుగా ఉపయోగించకూడదు”
”మీ రాజకీయ ప్రత్యర్థి పనితీరు, దూరదృష్టి, నాయకత్వానికి మీరు సరిపోలలేరని తెలిసినప్పుడు.. వ్యక్తిగత దూషణలు, అసభ్య వ్యాఖ్యలే సులభమైన మార్గంగా మారుతాయి. ఉదయనిధి స్టాలిన్, ఆయన తండ్రి ఎంకే స్టాలిన్ గతంలో అనేక వివాదాలను ఎదుర్కొని ఉండొచ్చు. కానీ వాటిని ప్రజా జీవితంలో అనుసరించాల్సిన ప్రమాణాలుగా ఎప్పుడూ భావించకూడదు. ప్రతిపక్ష నాయకుడు బహిరంగ వేదికపై త్రిషను అవమానించినందుకు ఆమెకు బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలి. అతను తన తప్పును ఒప్పుకుంటాడో లేదో, క్షమాపణ చెప్పే ధైర్యం, సంస్కారం హుందాతనం అతనికి ఉన్నాయో లేదో చూద్దాం?” అని ఖుష్బూ తన పోస్టులో రాసుకొచ్చారు.
తమిళనాడు సీఎం విజయ్, త్రిష మధ్య సంబంధం గురించి గత కొన్నేళ్లుగా రూమర్స్ ప్రచారంలో ఉన్నాయి. విజయ్ ను విమర్శించే క్రమంలో పలువురు రాజకీయ నాయకులు ఆమె పేరుని ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ కూడా అదే చేశారు. కావేరీ నదీ జలాల అంశంపై సోమవారం జరిగిన నిరసనలో ఆయన మాట్లాడుతూ.. విజయ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన మాట్లాడుతున్న సమయంలో డీఎంకే కార్యకర్తలు ‘త్రిష, త్రిష’ అంటూ నినాదాలు చేశారు. ఆ నినాదాల మధ్యనే తన ప్రసంగాన్ని కొనసాగించిన ఉదయనిధి.. పరోక్షంగా త్రిష ప్రస్తావన తీసుకొచ్చారు. డబుల్ మీనింగ్ వచ్చేలా అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే తాను చెప్పింది కావేరీ వాటర్ గురించి అంటూ ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. త్రిషపై ఉదయనిధి చేసిన కామెంట్స్ ఇప్పుడు తమిళనాడులో హాట్ టాపిక్ గా మారాయి.

