
బాలీవుడ్ స్టార్ దర్శకుడు నితీష్ తివారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణ’ విడుదలకు ముందే వివాదాల కేంద్రంగా మారింది. దాదాపు రూ.4,000 కోట్ల వ్యయంతో రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘శ్రీ రామ్జీలా మహాసంఘ్’ ప్రతినిధులు చిత్ర నిర్మాతలకు లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది.
‘శ్రీ రామ్జీలా మహాసంఘ్’ అధ్యక్షుడు అర్జున్ కుమార్ ఇటీవల చిత్ర బృందానికి పంపిన లేఖలో హిందూ మత విశ్వాసాలు, కోట్లాది భక్తుల మనోభావాలను దెబ్బతీయకుండా అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. తాజాగా విడుదలైన ట్రైలర్లోని కొన్ని సన్నివేశాలు, విజువల్ ప్రజెంటేషన్ తమను నిరాశపరిచాయని, అందులో కావాల్సిన భావోద్వేగం కనిపించలేదని పేర్కొన్నారు. గతంలో ‘ఆదిపురుష్’ సినిమా విడుదల సమయంలో ఎదురైన విమర్శలు, వివాదాలు మరోసారి పునరావృతం కాకుండా చూడాలని చిత్ర యూనిట్ను హెచ్చరించారు.
అంతేకాకుండా, సినిమా థియేటర్లలో విడుదల చేసే ముందు తమ సంఘం ప్రతినిధులకు ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఈ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోకుండా నేరుగా సినిమాను విడుదల చేస్తే దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాల్సి వస్తుందని నిర్మాతలు, దర్శకుడికి హెచ్చరిక జారీ చేశారు.
ఇక ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ మైథలాజికల్ చిత్రంలో ‘రామాయణ: పార్ట్ 1’ను 2026 దీపావళి సందర్భంగా, ‘రామాయణ: పార్ట్ 2’ను 2027 దీపావళి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది.

